హైదరాబాద్ పాతబస్తీలో వైట్నర్ యూజర్లు రెచ్చిపోయారు. మద్యం మత్తులో పోలీసులనే పరిగెత్తించి చితకబాదారు. ఫలక్ నుమా పీఎస్ పరిధిలో కొందరు యువకులు, వ్యక్తులు వైట్నర్ కు బానిసలుగా మారి స్థానికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. దీనిపై ఫిర్యాదు అందడంతో పాతబస్తీ పోలీసులు. .పలక్నూమా ప్రాంతంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.
ఇందులో భాగంగా పలు ప్రాంతాల్లో దాడులు చేసి కొందరు వైట్నర్ యూజర్లను అదుపులోకి తీసుకున్నారు. వారందరిని ఫలక్నుమా పోలీస్స్టేషన్కు తరలించారు. వారిలో కొందరిపై కిడ్నాప్ కేసులు కూడా ఉన్నట్లు గుర్తించి విచారిస్తుండగా.. వైట్నర్ మత్తులో రెచ్చిపోయారు. పోలీసులు, ఫిర్యాదు చేసిన వారిపై దాడులకు తెగబడ్డారు. పోలీసులపై చెప్పులు విసురుతూ నానా బూతులు తిట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షించి నిందితులను అక్కడ నుంచి తరలించే ప్రయత్నం చేశారు. ఆ టైమ్ లో వైట్నర్ గాళ్లు పిచ్చి పిచ్చి చేష్టలకు పాల్పడ్డారు. చేతులపై బ్లేడులతో గాట్లు పెట్టుకోవడం.. అందుబాటులో ఏది కనిపిస్తే దాంతో దాడులకు దిగారు. వారిని అదుపు చేయడం పోలీసులకు కూడా ఇబ్బందిగా మారింది.
అప్రమత్తమైన పోలీసులు నిందితులను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వైట్నర్ మత్తు నుంచి వారిని బయటకు తీసుకొచ్చేందుకు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వారికి వైద్య చికిత్స అందించారు.