ప్రపంచం చూపు భారత్ వైపు....ఇదేమి అతిశయోక్తి కాదు. ఎందుకంటే...అత్యంత బలమైన ప్రజాస్వామ్య కలిగిన భారత్లో మరికొన్ని గంటల్లో లోక్సభ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో జరిగాయి. లోక్ సభ ఎన్నికలతో పాటే ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈవీఎంలు కేంద్ర బలగాల పహారాలో స్ట్రాంగ్ రూముల్లో ఉన్నాయి. అయితే, సమయం గడుస్తున్న కొద్దీ పార్టీల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ప్రజల్లో ఏ పార్టీ గెలుస్తుందనే దానిపై ఎవరి లెక్కలు వాళ్లు వేసుకుంటున్నారు. హంగ్ వస్తుందని కొందరు, NDAకే మెజార్టీ అని ఇంకొదరు భావిస్తున్నారు. ఒకవేళ హంగ్ వస్తే.. ఎవరు కింగ్ మేకర్ అనే దానిపైనా ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు.
మరోవైపు,ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఎన్డీఏదే మళ్లీ అధికారముంటన్నాయి. దీంతో ఎగ్జిట్ పోల్స్ పైనా రెండ్రోజులుగా పార్టీల మధ్య డైలాగ్ వార్ నడిచింది. ఎగ్జిట్ పోల్స్ నమ్మేది లేదని విపక్షపార్టీ ల నాయకులు అంటుంటే.. రాబోయే ఫలితాలనే ఎగ్జిట్ పోల్స్ చెప్పాయని అధికారపార్టీ నాయకులు చెప్పుకొచ్చారు. ఇక ఎన్డీఏ పార్టీలకు నిన్ననే బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా విందు ఇవ్వగా...దీనికి ఎన్డీఏ పార్టీలన్ని హాజరయ్యాయి. నితీష్ కుమార్, ఉద్దవ్ ఠాక్రే లాంటి సీనియర్లంతా డిన్నర్ కు వచ్చారు. దీనికంటే ముందు కేంద్రమంత్రులతో ప్రధాని మోడీ సమావేశమయ్యారు. మళ్లీ గెలుపు మనదేనంటూ ధీమా వ్యక్తం చేశారు. అటు ప్రతిపక్షాలు మాత్రం ఈవీఎం, వీవీప్యాట్లపై పోరాటం చేశాయి. నిన్న 22పార్టీల నేతలు CECని కలిశారు. ముందుగా VVPATలు లెక్కించి తర్వాతే ఈవీఎంలు లెక్కించాలంటూ ప్రపోజల్ పెట్టాయి. అయితే ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. దీంతో నేడు ఫలితాల ఎప్పటిలాగే విడుదల కానున్నాయి.
ఏడు దశల్లో ఎన్నికలు ఇలా జరిగాయి
-- 20 రాష్ట్రాల్లోని 91 నియోజకవర్గాల్లో తొలి విడత పోలింగ్ ఏప్రిల్ 11న జరిగింది. ఈ ఫేజ్ లో ఏపీ, తెలంగాణలో ఒకే విడతలో పోలింగ్ పూర్తయింది.
--- ఏప్రిల్ 18న రెండో విడతలో 13 రాష్ట్రాల్లోని 97 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది.
-- ఏప్రిల్ 23న మూడో విడత పోలింగ్ జరిగింది. 14 రాష్ట్రాల్లోని 115 స్థానాల్లో పోలింగ్ నిర్వహించారు.
-- నాలుగో విడత ఏప్రిల్ 29న 9 రాష్ట్రాల్లోని 71 నియోజకవర్గాల్లో ఎన్నికలు నిర్వహించారు.
-- మే 6న మొత్తం 7 రాష్ట్రాల్లోని 51 సీట్లకు ఐదో విడత పోలింగ్ జరిగింది.
---ఆరో విడత పోలింగ్ మే 12న పూర్తయింది. 7 రాష్ట్రాల్లోని 59 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు.
చివరగా ఏడో విడత మే 19న జరిగింది. ఇందులో 8 రాష్ట్రాల్లోని 59 నియోజక వర్గాలకు పోలింగ్ నిర్వహించారు.