ఏపీముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలిసారిగా చేసిన ధైర్యం అట్టర్ ప్లాప్ అయింది. రాజకీయాల్లో నాలుగు దశాబ్దాల అనుభవం ఉందని చెప్పుకొనే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎన్నికల్లో ఏదైనా పార్టీతో పొత్తు పొడిస్తేకానీ బరిలో దిగేవారు కాదు. ఎన్నికల సమయంలో రాజకీయపార్టీలు పొత్తులకు సిద్ధమవుతుంటే.. చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీకి ఎన్నికలనగానే పొత్తులకోసం పక్కచూపులు చూడడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ దఫా సొంతంగా పోటీచేయగా...ఘోర పరాజయం చవిచూసింది.
కాంగ్రెస్లో తన రాజకీయప్రస్థానాన్ని ప్రారంభించిన చంద్రబాబు.. తరువాత మామ ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలో చేరారు. ఆపై జరిగిన రాజకీయపరిమాణాలు.. వెన్నుపోటు రాజకీయాల నేపథ్యంలో ఎన్టీఆర్ సీఎం కుర్చీని చంద్రబాబు లాగేసుకున్నారు. 1999 ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ తొలిసారిగా పోటీచేసింది. ఆ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపెట్టుకున్న చంద్రబాబు వాజపేయి ప్రభతో గట్టెక్కారు. ఆ తరువాత అలిపిరి ఘటనతో తనతోపాటు కేంద్రంలోని ఎన్డీయేను కూడా ముందస్తుకు నడిపించి.. 2004 ఎన్నికల్లో బొక్కా బోర్లాపడ్డారు. 2009లో మహాకూటమిగా బరిలో దిగిన చంద్రబాబు ఓటమి పాలయ్యారు.
2014 ఎన్నికల్లో జనసేన-బీజేపీతో కలిసి టీడీపీ పొత్తు పెట్టుకొని గెలుపొందింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో టీడీపీ నేతలు ధైర్యం చేసి ఒంటరి పోరుకు సిద్ధమయ్యారు. అయినప్పటికీ....చంద్రబాబుకు ఓటమి షాక్ తప్పలేదు. తెలుగుదేశం పార్టీ చరిత్రలో లేని విధంగా తీవ్ర పరాజయం పాలైంది. మంత్రులు, సీనియర్ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సైతం వైసీపీ దాటికి మట్టికరిచారు.