కియా...ఈ పదం తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితం. అనంతపురం జిల్లాలో కార్ల తయారీ కంపెనీ ప్లాంట్ ఏర్పాటుతో ఈ కంపెనీ గురించి తెలిసింది.క్షిణ కొరియాకు చెందిన ఈ సంస్థ అనంతపురం జిల్లా పెనుగొండ మండలం ఎర్రమంచి గ్రామం వద్ద సుమారు 600 ఎకరాల్లో.. రూ. 13 వేల కోట్ల వ్యయంతో ఈ యూనిట్ను ఏర్పాటు చేసింది. దీనివల్ల దాదాపు మూడువేల మందికి ఉపాధి అవకాశాలు లభించనుందని ప్రచారం చేసింది. అయితే, ఇందులో పెద్ద స్కాం జరిగిందని...త్వరలో ఇది బట్టబయలు కానుందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్ చేశారు.
`కియా కార్ల కంపెనీతో ఇంటికో ఉద్యోగం వస్తుందని ఊదరగొట్టిన కుల మీడియా ఇప్పుడు కొత్త రాగం అందుకుంది. అక్కడ అంతా తమిళులే అని, ప్రాజెక్టు అభివృద్ధి జరగలేదని ఏడుపు లంకించుకున్నాయి. దొంగ ఏడుపులు వద్దు. యువ సీఎంకు ఏం చేయాలో తెలుసు. కియా పేరిట జరిగిన భూకుంభకోణం పుట్ట త్వరలోనే పగులుతుంది.`` అంటూ విజయసాయిరెడ్డి తన ట్వీట్లో పేర్కొన్నారు.
ఈ ఏడాది జనవరిలో 'కియా మోటార్స్ ఇండియా' కంపెనీ ప్లాంట్లో కియా కారును ఆవిష్కరించిన అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నా జీవితంలో అత్యంత ఎక్కువ సంతోషించిన రోజు ఇదే అన్నారు. కియా అతి వేగంగా జరిగిన నిర్మాణం, పూర్తైన తీరు ఆశ్చర్యం కలిగిస్తోందన్న చంద్రబాబు.. 2017 ఏప్రిల్లో కియాతో ఎంఓయూ కుదుర్చుకున్నాం.. కియాను ఛాలెంజింగ్గా తీసుకున్నామని గుర్తుచేసుకున్నారు. దేశంలోనే 2వ అతి తక్కువ వర్షపాతం ఉన్న జిల్లాకు కియా వచ్చిందన్న సీఎం.. భవిష్యత్లో దేశంలోనే అగ్రగామిగా అనంతపురం జిల్లా ఉంటుందనే దీమా వ్యక్తం చేశారు.రాళ్ల సీమను రతనాలసీమగా మార్చే తొలి అడుగు 'కియా'నే అన్నారు.