మోదీ ప్రభుత్వం కాశ్మీర్ లకు ప్రత్యేక హక్కులు కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు చేయడం, ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం అని.. ఇప్పటికే కాశ్మీర్ లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రాజ్యసభలో అమిత్ షా ఈ బిల్లుని ప్రవేశపెట్టడం.. దాన్ని క్షణాల వ్యవధిలోనే రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయటం అంతా నాటకీయంగా ఉందని.. కాశ్మీర్ లో అదుపు తప్పుతున్న పరిస్థితులకు కారణం మోదీ కుట్రపూరిత నిర్ణయమే అని జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత మెహబూబా ముఫ్తీ తీవ్రంగా మండపడ్డారు. ప్రజాస్వామ్య చరిత్రలో ఇదో చీకటి రోజని ఆమె తన ఆగ్రహాన్ని తెలియజేశారు.
ఇంతకీ మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై జమ్మూ కశ్మీర్ లో ఎందుకు అంతగా వ్యతిరేఖత వస్తోంది..? ముఖ్యంగా అక్కడి ప్రజలను భయపెట్టి.. జమ్మూ కశ్మీర్ భూభాగాన్ని మోదీ ప్రభుత్వం కోరుకుంటుందేమోనని.. అక్కడి ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయి. ఈ నిర్ణయం తీసుకునే ముందే.. మోదీ అక్కడి ప్రజల్లో ఈ అపోహలను తొలిగించాల్సింది. పైగా మోదీ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వంగానే ఈ నిర్ణయం తీసుకునట్లు కనిపిస్తోంది. అటు కాశ్మీర్ నాయకులు కూడా తమకు ఇచ్చిన వాగ్దానాలను బీజేపీ ప్రభుత్వం ఏ మాత్రం నిలబెట్టుకోలేదని.. మొత్తంగా మోదీ - అమిత్ షా ద్వయం పూర్తిగా విఫలమైందని.. తీవ్రంగా విమర్శిస్తున్నారు.
అసలు ఈ తీర్మానం ప్రవేశపెడుతున్న సమయంలోనే రాజ్యసభలో కాశ్మీర్ చెందిన పీడీపీ పార్టీ సభ్యులు.. చొక్కాలు చించుకొని మరీ తీవ్ర పదజాలంతో నిరసనలు వ్యక్తం చేస్తూ.. సభలో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారు. కాశ్మీర్ ఎంపీలు నజీర్ అహ్మద్ లావే, మీర్ మహమ్మద్ ఫయాజ్ రాజ్యాంగ ప్రతులను చించేయడం కూడా తీవ్ర దుమారాన్ని రేపింది. అయితే వారి ప్రవర్తన పై రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు తీవ్రంగా మండిపడ్డ.. వారు మాత్రం తమ ఆగ్రహాన్ని అణుచుకోలేదు. అలాగే తమ నిరసనలను పెంచుతుండటంతో.. మార్షల్స్ సాయంతో చివరికీ వారిని బయటకు పంపారు. అయినా వారు రాజ్యసభ ఎదురుగా నిలబడి తమ నిరసనలను అలాగే కొనసాగించారు.
దీనికి తోడు కాశ్మీర్ లో పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా నిరసన సెగలు భగ్గుమంటున్నాయి. అక్కడి నాయకుల కంటే కూడా ప్రజల్లోనే ఎక్కువుగా దీని పై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తుండటంతో... అక్కడి నాయకులు కూడా దీన్ని తీవ్రంగా వ్యక్తిరేకించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఆ నిరసనల సెగలు తమ ప్రభుత్వాన్ని అంటుకోకముందే.. మోదీ ప్రభుత్వం ముందు జాగ్రత్తగా దాదాపు 30 వేల బలగాలను జమ్మూ కాశ్మీర్ లో నలుమూలలకు పంపి ఎప్పటికప్పుడూ అల్లరి మూకలను అదుపులోకి తీసుకుంటుంది. మరి ఇప్పటికైతే బలగాల సాయంతో నిరసనలను అణిచివేసిన.. భవిష్యత్తులో ఈ అంశం పై మోదీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.