ఇక అందాల కశ్మీరులో శాంతి వర్ధిల్లుతుంది, అధికరణ 370ని రద్దు చేస్తే చాలు కశ్మీరు సమస్య పరిష్కారమైపోతుందని హోంమంత్రి అమిత్‌ షా అంటున్నారు. జమ్మూ కశ్మీరుకు కేంద్రపాలిత ప్రాంతం హోదా శాశ్వతం కాదని, శాంతి స్థాపించిన తర్వాత మళ్ళీ పూర్తి రాష్ట్రం హోదా ఇస్తామని, శాంతి స్థాపిస్తామని, శాంతిస్థాపనలో అడ్డుగా ఉన్న అధికరణ 370 ఇప్పుడు తొలగించామని వారు అంటున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి అభిప్రాయం ప్రకారం అధికరణ 370, అధికరణ 35ఎ జమ్మూ కశ్మీర్‌లో శాంతిని నాశనం చేశాయి.


'' జమ్మూ కశ్మీరును ముక్కలు చేసి, హఠాత్తుగా అధికరణ 370 రద్దు చేసిన పద్ధతి గమనించిన వారెవరైనా సరే కశ్మీరులో ఇలా శాంతిని సాధిస్తారంటే నమ్మలేరు. కశ్మీరులో భద్రతాదళాల ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత, భద్రతను సడలించిన తర్వాత, కశ్మీరీలు రోడ్లపైకి రావడం మొదలవు తుంది. కశ్మీరీల ఆగ్రహావేశాలు ముఖ్యంగా 35ఎకు సంబంధించినవే ఉంటాయి. దేశంలోని ఇతర ప్రాంతాలకు చెందిన హిందూ జనాభాను కశ్మీరులోకి తీసుకొచ్చి అక్కడ స్థిరపడేలా చేసి కశ్మీరు ముఖచిత్రాన్ని మార్చేస్తారన్న అపనమ్మకాలు కశ్మీరీల్లో ఎప్పటి నుంచో ఉన్నాయి. ముస్లిం మెజారిటీ రాష్ట్రాన్ని హిందూ మెజారిటీ రాష్ట్రంగా మార్చేస్తారని భయపడుతున్నారు.'' ఒక జాతీయ న్యూస్‌ పోర్టల్‌ అంటోంది.


ఆగ్రహావేశాలు మిన్నంటుతాయా ?;

' అధికరణ 35ఎ ను కశ్మీరీలు చాలా ముఖ్యంగా భావిస్తారు. అధికరణ 370 ఇప్పుడు దాదాపు అర్ధంలేనిదిగా మిగిలిపోయింది. తొలగించినా, ఉన్నా పెద్ద తేడా లేదు. దాదాపు 1948 తర్వాతి నుంచి కశ్మీరును పాలిస్తున్నది కేంద్రమే. కాబట్టి అధికరణ 370 కన్నా అధికరణ 35ఎ విషయంలో ఆగ్రహావేశాలు మిన్నంటుతాయి. కశ్మీరు చరిత్రను పరిశీలించిన వారికి ఈ మార్పుల తర్వాత హింసాకాండ చెలరేగవచ్చన్న భయాలు సహజంగానే కలుగుతాయి. తన నేల కోసం పోరాడే కశ్మీరీ యువకులు చాలా మంది వీధుల్లోకి రావచ్చు. ఇది తరాల తరబడి కొనసాగవచ్చు. చాలా ప్రదర్శనలను ప్రభుత్వం కర్ఫ్యూ ప్రకటించి లేదా అప్రకటిత కర్ఫ్యూ ద్వారా అణచేయడానికి ప్రయత్నించనూవచ్చు. ప్రదర్శనలు, నిరసనలు, ఆందోళనలను ప్రభుత్వం అడ్డుకోవడం, ప్రదర్శనకారులు రాళ్ళు రువ్వడం ఇవన్నీ ప్రారంభం కావచ్చు. రాళ్ళు రువ్వే వారిపై కాల్పు లు జరుగుతాయి. కాబట్టి కశ్మీరులో మరో హింసాకాండల విషవలయం, గతంలో కన్నా తీవ్రమైనది భవిష్యత్తులో ప్రారంభమయ్యే సూచనలున్నాయి.' అని రాజకీయ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.


' హింసాకాండ పెరగవచ్చు, ఒక్క కశ్మీరులోనే కాదు, ఎక్కడైనా జరగవచ్చు' అని మాజీ రా చీఫ్‌ ఎ.యస్‌.దులాత్‌ ఇటీవల అన్నారు. కశ్మీరు గురించి లోతయిన అవగాహన ఉన్న అధికారి ఆయన.


'' పాకిస్థాన్‌లోని టెర్రరిస్టులు, రావల్పిండిలో కూర్చున్న వారి అధినేతలు బహుశా ఇప్పుడు చాలా సంతోషిస్తూ ఉండవచ్చు. కశ్మీరులో ఉద్రిక్తత ఎంత పెరిగితే అంత మంచిదని వాళ్ళు భావిస్తారు. మిలిటెన్సీకి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తారు. నియంత్రణ రేఖను దాటి ఆత్మాహుతి దళాలను పంపించే ప్రయత్నాలు చేస్తారు. నిజానికి మోడీ సర్కారుకు ఈ విషయం తెలియనిది కాదు. అయినా ఇలా ఎందుకు చేశారన్నది ప్రశ్న. కశ్మీరులో ఉద్రిక్తత పెరగడం జాతీయ ప్రయోజనాలకు మంచిది కాదు.'' ది ప్రింట్‌ అనే న్యూస్‌ పోర్టల్‌ విశ్లేషించింది. (Cartoon by Narsim)


ఇలాంటి భావావేశాల వాతావరణం, ఉద్రిక్త వాతావరణం అలుముకుంటే ఎవరూ నిరుద్యోగం గురించి ఆలోచించే పరిస్థితి ఉండదు. అంటే జాతీయ ప్రయోజనాలు, బిజెపి ప్రయోజనాలు రెండు ఒక్కటే కావలసిన అవసరమేమీ లేదు. బిజెపి ప్రయోజనాలే బిజెపికి ముఖ్యం. కశ్మీరు ప్రజలతో, అక్కడి నాయకులతో మాట్లాడి, చర్చలు జరిపి వారిని కలుపుకుని నడవడంలో జాతీయ ప్రయోజనాలున్నాయి. నోట్లరద్దు వంటి నిర్ణయమే; కశ్మీరీ యువత ఆయుధాలు చేపట్టకుండా, మిలిటెన్సీ బాట పట్టకుండా వారిని నచ్చచెప్పడంలో జాతీయ ప్రయోజనాలున్నాయి. కాని అధికరణ 35ఎ రద్దు వల్ల అందుకు విరుద్ధంగా జరుగుతుంది. నిజానికి ఇప్పుడు జరిగింది కూడా నోట్లరద్దు వంటి నిర్ణయమే.

నోట్ల రద్దు ఏం సాధించిందో చూశాం. నల్లడబ్బు నాశనం చేస్తామన్నారు. కాని నోట్ల రద్దు ఆర్ధిక వ్యవస్థను కుదేలు చేసింది.అదే విధంగా ఇప్పుడు కశ్మీరులో శాంతి స్థాపనకే అధికరణ 35ఎ రద్దు అంటున్నారు. కాని దీని వల్ల పరిస్థితి మరింత దిగజారే అవకాశాలున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: