అకాశరాజుకంటే తానేమి తక్కువ కాదన్నట్లుగా రాచరికాన్ని ఒలకబోసే పాపికొండల నడుమ,గోదారమ్మ గలగల నవ్వుతూ, వొద్దికగా ఒదిగి లయబద్దమైన అలల సవ్వడితో పాపికొండలను ముద్దాడుతూ ముందుకు సాగుతుంది.వేదంలా ఘోషిస్తూ ఆ గిరుల కురుల మధ్య నుంచి పాపిటలా సాగిపోతూ పరవశిస్తుంది.అత్యంత సుందరమైన ఈ దృష్యాలను చూడాలని ఆరాటపడని వారుంటారా.దారి పొడవునా కనిపించే పసిడి కాంతుల ఇసుక తిన్నెలు,గిరిజనులు,నాటుపడవల సందడితో పాపికొండలు ఉట్టిపడుతూవుంటే పరవశించని హృదయాలు మరోవేకువలు నాకెందుకని అలకవేయవా.మరింతగా ప్రతి వారి మదిని దోచుకుంటున్న ఈ విహరవనములో దాగున్న విషాద హారాలు ఎన్నో ఎన్నేన్నో.అవన్ని బతుకుల్లో కలతలను రేపుతూ, తీరని ఆవేదనను మిగులుస్తూ వున్నాయంటే నమ్మడం ఒకింత ఆశ్చర్యం.ఆనందం వెనక విషాదం వుంటుందంటే ఇదే కాబోలు..ఇక జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందిన ఈ పాపికొండలను సందర్శించే విహారయాత్రల్లో చోటు చేసుకుంటున్న ప్రమాదాల ఫలితంగా ఎంతో మంది బలి అయ్యారు.ఆనందం కోసం చేసే పడవ ప్రయాణాలు.ప్రాణాలను అంతం చేస్తున్నాయి.ఇలా మూడు దశాబ్దాల కాలంలో వంద మందికి పైగా మృత్యువాత పడ్డ ప్రధాన ఘటనల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..



1985: వీఆర్‌ పురం మండలం శ్రీరామగిరిలోని శ్రీరామ నవమి కల్యాణాన్ని వీక్షించేందుకు సుమారు 50 మందితో వెళ్లిన బోటు ప్రమాదానికి గురై 40 మంది మృతిచెందారు.
1990: ఆత్రేయపురం మండల పరిధిలోని ఒద్దిపర్రు, వెలిచేరు, పేరవరం గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగించే లంకరేవులో పడవ మునిగి..పది మంది చనిపోయారు.
1992: ఐ.పోలవరం మండలం పరిధిలోని గోగుళ్లంక-భైరవలంక మధ్య చింతేరుపాయ వద్ద పడవ బోల్తా పడి..ముగ్గురు ఉపాధ్యాయులు మరణించారు.
1996: బోడసకుర్రు-పాశర్లపూడి మధ్య వైనతేయ నదీ పాయపై పడవ దాటుతుండగా బలమైన గాలులకు పడవ బోల్తా పడి.. పదిమంది వరకు కూలీలు చనిపోయారు.
2004: యానాం-ఎదుర్లంక వారధి నిర్మించక ముందు గౌతమీ గోదావరి నదీ పాయపై జరిగిన పలు పడవ ప్రమాదాల్లో 10మంది వరకు మృతిచెందారు.
2007: ఓడలరేవు-కరవాక రేవు మధ్య ప్రయాణికులతో వెళ్తున్న పడవ ప్రమాదానికి గురైంది.ఇంజన్ చెడిపోవడంతో..గాలికి సముద్రం వైపు కొట్టుకుపోతుండగా మరో పడవ ద్వారా అందులోని ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.



2008: రాజమహేంద్రవరానికి చెందిన న్యాయవాదులు పాపికొండల విహారయాత్రకు వెళ్తూ పడవ ప్రమాదానికి గురై ఇద్దరు మృతిచెందారు.
2009: అంతర్వేది-బియ్యపు తిప్ప మధ్యలో వశిష్ట సాగర సంగమం సమీపంలో ప్రయాణం చేస్తుండగా పడవ మునిగి పశ్చిమ గోదావరికి చెందిన ముగ్గురు బలయ్యారు.
2017: నవంబర్‌ 12న విజయవాడ సమీపంలోని పవిత్ర సంగమం వద్ద కృష్ణా నదిలో బోటు తిరగబడి 22 మంది మృత్యువాత పడ్డారు.
2018: మే 15న మంటూరు వద్ద 50 మందితో వెళ్తున్న లాంచీ బోల్తాపడిన ఘటనలో 19 మంది జలసమాధి అయ్యారు. మృత దేహాలను వెలికితీయడానికి మూడు రోజులు శ్రమించాల్సి వచ్చింది.



2018: 120మంది ప్రయాణికులతో వెళ్తున్న పర్యాటక బోటు అగ్నిప్రమాదానికి గురైంది.డ్రైవర్‌ అప్రమత్తమై బోటును సమయ స్ఫూర్తితో ఒడ్డుకు చేర్చడంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు.తాజాగా ఆదివారం దేవీపట్నం మండలం కచ్చలూరులో సంభవించిన దుర్ఘటన ఇదే ప్రాంతంలో మూడోది కావడం గమనార్హం.
2019: ఇప్పుడు 61 మందితో వెళ్తున్న బోటు..ప్రమాదానికి గురై..36 మంది గల్లంతయ్యారు.12 మంది మృతి చెందారు.ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతోన్నాయి.
ఒకటా,రెండా ఎన్నని ప్రమాదాలు జరుగుతూనే వున్నా.అటు పాలకుల్లో గానీ.ఇటు పర్యాటకుల్లో గానీ ఎలాంటి మార్పులు రావడం లేదు.కనీసం సేఫ్టీ ప్రికాషన్స్ పాటించకుండా..ఆనందంతో.. వెళ్లి..విషాదంతో తిరిగి వస్తున్నారు.తాజాగా జరిగిన ఈ ఘటతోనైనా.ఇప్పటికైనా.. ప్రజలు అప్రమత్తం అవ్వాలని..నదీ విహారం చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని అందరికి విన్నవించుకుంటున్నాం.

మరింత సమాచారం తెలుసుకోండి: