ప్రముఖ సినీ హస్య నటుడు వేణుమాధవ్ మృతి సినీ ఇండస్ట్రీలోనే కాదు...ప్రేక్షకులు, అభిమానులను తీవ్రంగా కలచివేసింది. గత కొంత కాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. నిన్న తీవ్ర అస్వస్థతకు గురైన వేణుమాధవ్ సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో ఆస్పత్రిలోచికిత్స పొందుతూ కన్నుమూశారు.
వేణుమాధవ్ మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. వేణుమాధవ్ మృతి పట్ల ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. తెలుగుదేశం పార్టీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. అలాగే చంద్రబాబు, నారా లోకేష్లు కూడా తన ట్విటర్ ఖాతాలో తన సంతాపాన్ని తెలియజేశారు.
హస్యనటుడుగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేశారు వేణుమాధవ్. టీడీపీ ఎన్నికల ప్రచారంలోనూ తనదైన ప్రత్యేకతతో ప్రజలని ఆకట్టుకున్నారని చంద్రబాబు అన్నారు. వేణుమాధవ్ మృతికి నివాళులర్పిస్తూ, నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను చెప్పారు. కమేడియన్గా కొనసాగుతూ, టీడీపీకి ఎంతో చేశారని గుర్తు చేశారు. వేణుమాధవ్ మరణంపై ఎంపీ, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
గుంటూరు పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు.. వేణుమాధవ్ మరణం గురించి తెలియడంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వేణు మాదవ్ మృతి సినీ ఇండస్ట్రీలో తీరని లోటని, వేణుమాధవ్ టీడీపీ, ఎన్టీఆర్ను ఎంతో అభిమానించేవారని గుర్తు చేశారు.
మహానాడులో మిమిక్రీ ప్రదర్శన ద్వారా ఎన్టీఆర్ను ఆకట్టుకున్నారని.. అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అంతేకాదు మహానాడు ప్రదర్శనలో టీడీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వేణుమాధవ్ ఎంతో అద్భుతంగా చెప్పారని, సభ అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ వేణుమాధవ్ను ప్రశంసించారట. టీడీపీ చేస్తున్న పలు అభివృద్ధి పనుల గురించి తన ప్రచారంలో ఎంతో వివరించారన్నారు. పలు విషయాలను చంద్రబాబు తన ట్విటర్ ద్వారా తెలియజేశారు. ఇప్పటి వరకు వేణుమాధవ్ టీడీపీ పార్టీకి చేసిన సేవలు మరువలేనివని అన్నారు.