స్కూల్కి వెళ్లే విద్యార్థులు ఫస్ట్ గోల్ ఏంటో తెలుసా పదవ తరగతి పాస్ అవ్వడం. పదో తరగతి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు అనుకోండి విద్యార్థుల ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. ప్రస్తుతం ఉన్న విద్యా విధానంలో పదవతరగతికి ఎంతో ప్రాధాన్యత ఉన్న విషయం తెలిసిందే. అందరు విద్యార్థులకు పదవతరగతి తమ భవిష్యత్తును నిర్ణయించే దిశ అని కూడా చెప్పవచ్చు. పదవతరగతి అంత ముఖ్యమైనది కాబట్టే తొమ్మిదో తరగతి వరకూ ఆడుతూ పాడుతూ తిరిగిన విద్యార్థులందరూ... పదోతరగతి లోకి అడుగు పెట్టగానే పుస్తకాలు తోనే కనబడుతుంటారు.
అయితే పదో తరగతి పరీక్షా విధానంలో కీలక మార్పులు చేసేందుకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత కొంత కాలంగా అమల్లో ఉన్న ఇంటర్నల్ మార్కుల విధానం ఎత్తివేసి... పదవ తరగతి పరీక్ష సమయం పొడిగించడం తోపాటు బిట్ పేపర్ కూడా ముందుగానే అందించే విదంగా పదవ తరగతి పరీక్షా విధానంలో సంస్కరణలు తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు.
పదవ తరగతి పరీక్షల్లో ఇంటర్నల్ మార్కుల విధానం వల్ల కార్పొరేట్ పాఠశాలల్లో దుర్వినియోగం అవుతుంది అన్న విషయం ఇప్పటికే తమ దృష్టికి వచ్చిందని ... అందువల్లే ఈ నూతన సంస్కరణలు తీసుకు వచ్చి ఎక్కడ అవకతవకలు జరగకుండా చూసేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. కాగా పదవ తరగతి పరీక్షా సమయాన్ని మరో పదిహేను నిమిషాల పాటు పెంచుతున్నట్లు వెల్లడించిన మంత్రి... బిట్ పేపర్ ను విడిగా కాకుండా ప్రధాన ప్రశ్నాపత్రంలోని ఇచ్చేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. జవాబులు రాసేందుకు 18 పేజీల బుక్లెట్ ను విద్యార్థులకు అందజేస్తామని మంత్రి తెలిపారు. కాగా ఈ సంస్కరణలు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలులోకి వస్తాయని స్పష్టంచేశారు మంత్రి.