భారత్లో ఉగ్ర కార్యకలాపాల విస్తృతి ఊహించని మలుపులు తిరుగుతోంది. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో...కశ్మీర్ కేంద్రం ఉగ్రకుట్రలు క్రమంగా రాజుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. జమ్ముకశ్మీర్కున్న ప్రత్యేక హోదాను రద్దు చేయడం జీర్ణించుకోలేని పాకిస్థాన్, దాని మద్దతుతో పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలు భారత్లో దాడులకు కుట్రలు చేస్తున్నట్టు స్పష్టమవుతోంది. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు అల్ఖైదా, ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్)లకు అనుబంధంగా పనిచేస్తున్న కొన్ని స్లీపర్సెల్స్ మన దేశంలో క్రియాశీలమైనట్టు నిఘా వర్గాలు తెలిపాయి. స్లీపర్ సెల్స్ సాయంతో అల్ఖైదా భారత్లోని యూదులు, ఇజ్రాయెలీలపై దాడులకు కుట్ర పన్నుతున్నట్టు నిఘా సంస్థలు హెచ్చరించాయి.
ఉగ్రవాద కార్యకలాపాలపై గత రెండు వారాలుగా హెచ్చరిస్తున్న నిఘా వర్గాలు తాజాగా సంచలన సమాచారం అందించాయి. ఆర్టికల్ 370 రద్దుపై భారత్కు మద్దతునిచ్చినందుకే ఇజ్రాయెల్ దేశీయులను లక్ష్యంగా చేసుకొని దాడులు జరుపాలని ఉగ్రవాద సంస్థలు నిర్ణయించినట్టు తెలుస్తోందని పేర్కొంది. ఇప్పటికే కొందరు ఉగ్రవాదులు దేశంలోకి అక్రమంగా ప్రవేశించారని, వారికి డ్రోన్ల సాయంతో ఆయుధాలు అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపాయి. తాజాగా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు అల్ఖైదా, ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్)లకు అనుబంధంగా పనిచేస్తున్న కొన్ని స్లీపర్సెల్స్ మన దేశంలో క్రియాశీలమైనట్టు హెచ్చరించాయి.
పక్కా ప్రణాళికతో టెర్రరిస్టులు పనిచేస్తున్నారని పేర్కొంది. ఈ నెల 29న యూదులు రోష్ హాషణా (నూతన సంవత్సరం) వేడుకలు జరుపుకుంటారు. ఆ తరువాత అక్టోబర్ 8న యూదుల పవిత్రమైన రోజు యోమ్ కొప్పీర్ వస్తుంది. ఆ తరువాత అక్టోబర్ 13 నుంచి 22 వరకు సుక్కోత్ వేడుకలను యూదులు జరుపుకుంటారు. ఈ సమయంలోనే న్యూఢిల్లీలోని ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయంపై, యూదులు అత్యధికంగా నివసించే పలు ప్రాంతాలపై దాడులు చేసేందుకు ఉగ్రవాద సంస్థలు కుట్ర పన్నుతున్నట్టు పలు విదేశీ నిఘా సంస్థలు భారత్కు సమాచారాన్ని అందించాయి. ఢిల్లీతోపాటు దేశంలోని పలు నగరాల్లో ఉన్న యూదుల సమాజ మందిరాలు, యూదుల పాఠశాలలు, వాళ్లు అత్యధికంగా సందర్శించే రెస్టారెంట్లు, హోటళ్లపై దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించాయి. దీంతో ఇజ్రాయెల్, యూదుల సంస్థలు, ఢిల్లీలోని చాబడ్ హౌస్ వద్ద భద్రతను మరింత పెంచారు.