ఆవు చేలో మేస్తే దూడ
గట్టున మేస్తుందా ? అన్న సామెతలాగే ఉంది తమ్ముళ్ళ వ్యవహారం. పొద్దున లేచింది మొదలు
చంద్రబాబునాయుడు రాత్రి పడుకునేంత వరకూ జగన్మోహన్ రెడ్డిపై నోటికొచ్చినట్లు
ఆరోపణలు, విమర్శలు చేస్తుంటే నేతలు మాత్రం ఊరకే ఉంటారా ? అందుకే మాజీ మంత్రి
దేవినేని ఉమా మహేశ్వరరావు లాంటి వాళ్ళు జగన్ కు పెరుగుతున్న ఇమేజిని ఏమాత్రం
తట్టుకోలేకపోతున్నారు. అందుకనే నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు.
వైసిపి ప్రభుత్వం తాజాగా వైఎస్సార్ కంటి వెలుగు అనే సంక్షేమ పథకాన్ని ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. అనంతపురంలో జగన్ స్వయంగా పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకాన్ని జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవటంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వమే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది కాబట్టి దానికి తగ్గట్లే పబ్లిసిటి కూడా దానికి తగ్గట్లే ఉంది.
ఇక్కడే చంద్రబాబు, దేవినేని తట్టుకోలేకపోతున్నారు. అందుకనే తమ హయాంలో తాము అమలు చేసిన పథకానికే పేరు మార్చి జగన్ కాపీ కొట్టాడంటూ దేవినేని మండిపోతున్నారు. చంద్రబాబు హయాంలోనే ’ముఖ్యమంత్రి ఈ ఐ కేంద్రం’ అనే పథకాన్ని అమలు చేశారట. రాష్ట్ర వ్యాప్తంగా 222 కేంద్రాలు ఏర్పాటు చేసి 67 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించారట. 6.21 లక్షల మందికి కళ్ళజోళ్ళు పంపిణి కూడా చేశారట.
అంతా బాగానే ఉంది కానీ ఇక్కడే అందరికీ అనుమానం వస్తోంది. చంద్రబాబు హయాంలో అసలు అటువంటి పథకం ఉందని కూడా చాలామంది టిడిపి నేతలకే తెలీదు. మీడియాలో ఆ పథకం గురించి ఎప్పుడూ వచ్చినట్లు కూడా లేదు. చేయని పనులనే చేసేసినట్లు భారీ పబ్లిసిటి చేసుకునే చంద్రబాబు అన్ని లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించే పథకానికి పబ్లిసిటి లేకుండా ఉంటారా ?
ఇక్కడే దేవినేని మాటలపై అందరిలోను ఓ అనుమానం వస్తోంది. నిజానికి అటువంటి పథకం ఉందని తెలియలేదంటే కేవలం ఆ పథకం కాగితాలకు మాత్రమే పరిమితమై ఉంటుంది. పథకం అమలు పేరుతో వందల కోట్ల రూపాయలు బొక్కేసుంటారు. అందుకే అమలు కానీ పథకం గురించి టిడిపి నేతలకే తెలీయలేదు.