ఏ రాజకీయ పార్టీకైనా కూడా బలం బలగం కావాలి. తామేంటో జనం వద్ద నిరూపించుకోవాలి. ఇపుడున్న రోజుల్లో ప్రచారానికి ఎంతో విలువ ఉంది. దానికి బలమైన గొంతుకలే కావాలి. వాదన గట్టిగా చేయగలగాలి. ఎటువంటి విపత్కర పరిస్థితుల్లోనైనా కూడా ఎఫెన్శ్ మోడ్ లో వెళ్ళాలి కానీ డిఫెన్స్ లో పడకూడదు. అందుకే వైసీపీ అధినాయకత్వం కూడా యుద్ధానికి సిధ్ధమయ్యే సైన్యాన్ని ఎంపిక చేసుకుంది.
వైసీపీకి కొత్తగా ముప్పయిమంది వరకూ అధికార ప్రతినిధులను చేశారు. వారి అనుభవం, వాదనా పటిమను గుర్తించి మరీ పీ పదవులకు తీసుకున్నారు. పార్టీ అధికారంలో ఉన్నపుడు ప్రతినిధులు అంటే అది పెద్ద గుర్తింపే మరి. ఆ విధంగా చూసుకుంటే ఈ జాబితాలో 20 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ ఉన్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. అధికార ప్రతినిధులుగా ఉండవల్లి శ్రీదేవి, మేరుగ నాగార్జున, తెల్లం బాలరాజు, రాజన్న దొర, విడదల రజని, ధర్మాన ప్రసాదరావు, కె.పార్థసారథి, జోగి రమేష్, సిదిరి అప్పలరాజు, అదీప్ రాజ్, మహ్మద్ ఇక్బాల్, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, కిలారు రోశయ్య, జక్కంపూడి రాజా, అబ్బయ్య చౌదరి, మల్లాది విష్ణు, కాకాని గోవర్థనరెడ్డి, జి.శ్రీకాంత్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, బత్తుల బ్రహ్మానందరెడ్డి, నారమల్లి పద్మజ, కాకమాను రాజశేఖర్, అంకంరెడ్డి నారాయణమూర్తి, నాగార్జున యాదవ్, రాజీవ్ గాంధీ, కె.రవిచంద్రారెడ్డి, ఈదా రాజశేఖర్ రెడ్డి, పి.శివ శంకర్ రెడ్డి ఉన్నారు.
ఇపుడు వీరంతా వైసీపీ ప్రభుత్వ విధానాలను, పార్టీ విధానాలను జనంలోకి తీసుకుపోతారు. ప్రతిపక్ష పార్టీలు చేసే విమర్శలను సమర్ధంగా తిప్పికొడతారు. ఈ జాబితాను పార్టీ వ్యవహారాల ఇంచార్జి విజయసాయిరెడ్డి విడుదల చేశారు. దీంతో ఇక వైసీపీ సమరభేరి మోగించినట్లేనని అంటున్నారు.