హుజూర్ నగర్ ఓట్ల
లెక్కింపులో టిఆర్ఎస్ జోరందుకుంది. అందరూ అనుకున్నట్లే టిఆర్ఎస్ అభ్యర్ధి
సైదిరెడ్డికి మూడో రౌండ్లో 10,747 ఓట్ల మెజారిటి వచ్చింది. మొత్తం 22 రౌండ్లలో మొదటి రౌండే సుమారు 2500
ఓట్ల ఆధిక్యమంటే చిన్న విషయం కాదు. కౌంటింగ్ ప్రారంభమే పోస్టల్ సర్వీసు ఓట్లతో మొదలైంది.
ఇందులో కూడా సైదిరెడ్డి ఆధిక్యం స్పష్టంగా కనబడింది.
మొదటి నుండి ఉపఎన్నికను ఇటు కాంగ్రెస్ అటు టిఆర్ఎస్ బాగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్ సిట్టింగ్ సీటు కాబట్టే పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మరికొందరు కాంగ్రెస్ నేతలు సవాలుగా తీసుకున్నారు. అయితే అధికారంలో ఉండటం టిఆర్ఎస్ కు బాగా కలిసొచ్చే అంశం. పోటిలో టిడిపి, బిజెపి అభ్యర్ధులు కూడా ఉన్నప్పటికీ వాళ్ళపోటి కేవలం నామమాత్రమే.
ఉపఎన్నిక మొదలవ్వగానే ఆర్టీసీ సమ్మె మొదలైంది. దాంతో సమ్మె ఉధృతమయ్యే కొద్దీ ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, వామపక్షాలు, విద్యార్ధి సంఘాలు కెసియార్ వైఖరికి వ్యతిరేకంగా రోడ్డెక్కాయి. పై పక్షాలన్నీ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా నిలబడటంతో ఉపఎన్నికలో గెలుపుపై టిఆర్ఎస్ ఆశలు వదిలేసుకున్నట్లు ప్రచారం జరిగింది. అదే సమయంలో కెసియార్ బహిరంగసభ కూడా వర్షం కారణంగా రద్దయ్యింది.
ఇన్ని ప్రతికూలతల్లో టిఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డి గెలుపు కష్టమనే భావనే కనబడింది. దానికి తోడు హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఇప్పటి వరకూ టిఆర్ఎస్ అభ్యర్ధులు గెలిచిందే లేదు. స్వయంగా కెసియార్ ప్రచారం నిర్వహించినా ఎంతమంది నేతలను ఇన్చార్జిగా నియమించినా టిఆర్ఎస్ గెలిచిందే లేదు. అంటే ఈ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అనే చెప్పుకోవాలి.
ఇలాంటి నియోజకవర్గంలో గెలుపును కెసియార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కాబట్టి ఉపఎన్నికలో గెలుపు అన్నది పూర్తిగా సస్పెన్సుగా మారింది. అయితే కౌంటింగ్ మొదలైన దగ్గర నుండి సరళిని చూస్తుంటే పూర్తిగా టిఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నట్లే కనబడుతోంది. మొదటి రౌండ్ కే దాదాపు 11 వేల మెజారిటి వచ్చిందంటే టిఆర్ఎస్ గెలుపు లాంఛనమనే అనుకోవాలి.