మనరాష్ట్రంలో దీపావళి పండగను పేద, ధనిక అనే తేడా లేకుండా అందరు జరుపుకుంటారు. అది వారి స్దాయిని బట్టి ఉంటుంది. ఇకపోతే అందరిలా పండగచేస్తే అందులో వెరైటి ఏం ఉంటుంది. అందుకే సరికొత్తగా చేద్దామని యూపీ ప్రజలు, ప్రభుత్వం ఆలోచించింది. ఆ ఆలోచనను అమలుకూడా చేసి గిన్నీస్ రికార్డ్లో చోటు సాధించింది. ఇకవిషయం ఏంటంటే దీపావళి వేడుకలో కొత్త చరిత్ర సృష్టించింది.
అయోధ్యలోని సరయూ నదీతీరంలో నిర్వహించిన ఉత్సవం. శనివారం సాయంత్రం రామ్కీ పౌఢీ వద్ద ఉన్న సరయు నది గట్టుపై 6 లక్షలకుపైగా ప్రమిదలతో దీపాలను వెలిగించడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా స్వర్ణ కాంతుల శోభితమయ్యింది. ఆ కాంతి కళ్ళుమిరుమిట్లు గొలిపేలా ఆ ప్రాంతమంతా విస్తరించింది.. ఇక 2017లో తొలిసారి రామ్కీ పౌడీ వద్ద 301,186 ప్రమిదలు వెలిగించగా, 2018లో 4 లక్షల 10 వేల దివ్వెలు వెలిగించారు. ఈ ఏడాది ఆరు లక్షలకుపైగా దీపాలను వెలిగించడం విశేషం. యూపీ ప్రభుత్వం, పర్యాటక శాఖ, రామ్ మనోహర్ లోహియా అవధ్ యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహించిన ఈ వేడక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ల్లో చోటు సంపాదించింది.
ఇక ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్, ఫిజీ స్పీకర్ వీణా భట్నాగర్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అయోధ్యలో గత మూడేళ్లుగా యూపీ ప్రభుత్వం దీపావళి వేడుకలను నిర్వహిస్తూ వస్తోంది. ఇదేకాకుండా శనివారం ఉదయం ప్రారంభమైన దీపోత్సవం ఊరేగింపులో దేశంలోని నలుమూలల నుంచి కళాకారులతో పాటుగా, ఏడు దేశాలకు చెందిన ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.
ఇక దాదాపు 2,500 మంది విద్యార్థులు రాముడి జీవితంలోని ఘట్టాలతో చిత్రాలు గీశారు. ఈ సందర్భంగా సీఎం యోగి రూ.226 కోట్లతో వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రారంభించారు. ఇదేగాకుండా యూపీ సర్కారు అయోధ్య దీపోత్సవాన్ని రాష్ట్ర పండగగా ప్రకటించి ఏటా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. ఇకపోతే అయోధ్య వివాదం కేసు తీర్పును సుప్రీంకోర్టు మరికొద్ది రోజుల్లో వెలువరించనున్న నేపథ్యంలో ఈ ఉత్సవాలకు అధిక ప్రాధాన్యత ఏర్పడింది.