గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కలగానే మిగిలిపోయే పరిస్థితి నెలకొన్నది. ఎప్పటికీ పూర్తి చేసి ఇళ్లను తమకు అప్పగిస్తారోనని లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. గత రెండేళ్ల నుంచి బస్తీలను విడిచి పెట్టి ఇరుకు గదుల్లో కిరాయికి ఉంటున్నారు. అసలే పేదరికం కిరాయి ఇళ్లల్లో ఉండి ప్రతి నెల కిరాయి కట్టాలంటే చాలా ఇబ్బందుల పాలౌవుతున్నారు. రోజు వారి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న పేదలకు జీవనం మరింత భారమైంది. దీంతో తాము ఇప్పటికే ఉన్న బస్తీల్లోని సొంత ఇళ్లల్లోనే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కట్టిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఖాళీ చేయించింది. ఆరు నెలల్లోనే ఇళ్లను పూర్తి చేసి ఇస్తామని బస్తీ వాసులను ఖాళీ చేయించారు. కానీ రెండేళ్లు గడుస్తున్నప్పటికీ ఇళ్ల నిర్మాణం పిల్లర్ల వరకే వచ్చాయని బస్తీ వాసులు ఆందోళన చెందుతున్నారు. ఇన్నాళ్లు బస్తీల్లో ఏదో రకంగా జీవనం సాగిస్తున్న తమను రోడ్డుపైకి ప్రభుత్వం లాగేసిందని వాపోతున్నారు. సొంతిళ్లను వదిలి కిరాయి ఇళ్లల్లో ఉంటూ జీవనం సాగించడం చాలా కష్టంగా ఉందని వాపోతున్నారు. జీ హెచ్ఎంసీ అధికారులను ఆరా దీస్తే ఎప్పటికీ పూర్తవుతుందో కూడా స్ఫష్టం చెప్పలేకపోతున్నారు. దీంతో జీహెచ్ఎంసీలోని పలు బస్తీలను ఖాళీ చేసిన లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేకపోవడంతో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకు సంబంధించి నిధుల విడుదలలో జాప్యం జరుగుతోంది. వీటి నిర్మాణానికి దాదాపు రూ.9,348 కోట్లు అవసరం ఉండగా వరకు రూ.4,260 కోట్లు ఖర్చు చేశారు. 11 కాలనీల్లో దాదాపు 8వేల ఇళ్ల నిర్మాణం పూర్తయిందని అధికారులు చెబుతున్నారు. వీటిల్లో దాదాపు 1,400 పాత ఇళ్లు/గుడిసెల స్థానంలోనే నిర్మించినవి కావడంతో లబ్ధిదారులను వేరుగా గుర్తించాల్సిన పనిలేదు.


ఇదిలా ఉండగా గ్రేటర్‌లో దాదాపు 5లక్షల మంది డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులు చేసుకొని దాదాపు మూడేళ్లు పూర్తి కావస్తున్నది. వీరంతా కూడా ఇళ్లు ఎప్పుడు ఇస్తారా? అని వీరందరూ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. నగరంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణానికి కేంద్రం ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై) ద్వారా రూ.1,500 కోట్లు రాయితీ ఇస్తోంది. ఇందులో రూ.600 కోట్లు ఏడాది క్రితమే విడుదల చేసింది. మిగతా నిధులు ఇచ్చేందుకూ సిద్ధంగానే ఉంది. కానీ లబ్ధిదారుల జాబితా అందకపోవడంతో కేంద్ర ప్రభుత్వం నిలిపివేసిందని తెలిసింది.


జీహెచ్ఎంసీలో బస్తీల్లో నివశిస్తున్న వారిని ఖాళీ చేయించి అదే స్థానంలో ఇళ్ల నిర్మాణం చేపట్టడం. అసలే ఇళ్లు లేని వారికి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను నిర్మించి ఇవ్వడం. ఈ రెండు పద్ధతుల ద్వారా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించేందుకు ప్రభుత్వం తలపెట్టింది. కానీ ఇళ్లు లేని వారే 5లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, వారికి సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక ఇంకా పూర్తి కాలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం నుంచి రెండో దశ నిధులను ప్రభుత్వం అడగడం లేదు.


‘అందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రాయితీగా ఒక్కో ఇంటికి రూ.1.50 లక్షల చొప్పున చెల్లిస్తోంది. మొత్తం మూడు దశల్లో వీటిని విడుదల చేస్తోంది. తొలిదశ నిధుల విడుదలకు పెద్దగా అభ్యంతరాలుండవు. దాంతో మొదటిసారి గ్రేటర్‌కు రూ.600 కోట్లు విడుదల చేసింది. పురోగతిలోని పనులను బట్టి మిగతా నిధులు విడుదల చేస్తుంది. రెండో విడత నిధులు విడుదల చేసేందుకు గాను ఈ ఇళ్ల లబ్ధిదారుల జాబితాను అందజేయాల్సిందిగా బల్దియాను కోరింది. జాబితా పంపించాల్సిందిగా సంబంధిత శాఖ ప్రతినిధి గత వారం జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులను కలిసి కూడా సూచించారు. కానీ లబ్ధిదారుల ఎంపికే పూర్తి కాకపోవడంతో అధికారులు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ జాబితాను పంపితే మరో రూ.600 కోట్లు అందుతాయి. మిగతా రూ.300 కోట్లు తుది దశలో విడుదల చేస్తారు. పీఎంఏవై మార్గదర్శకాల మేరకు జాబితా తప్పనిసరి అని, తెలంగాణ మాత్రమే ఈ జాబితా పంపలేదని సమాచారం. వీరి జాబితాను అందిస్తే రెండో దశలో కేంద్రం నుంచి రూ.600 కోట్లు వచ్చేవి. వాటితో మిగతా ఇళ్ల పనులు కూడా చకచకా ముందుకు సాగేవనే అభిప్రాయాలున్నాయి. కానీ లబ్ధిదారుల ఎంపిక పూర్తికాకపోవడంతో ఈ పనులు జరగలేదు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల పరిస్థితి ఎలా ఉన్నా గ్రేటర్‌ పరిధిలో మాత్రం ఇళ్ల నిర్మాణానికి అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. అన్నీ సకాలంలో జరిగితే ఇప్పటికే ఇళ్లు పూర్తయ్యేవి. ఇప్పటికైనా సకాలంలో నిధులందితే అధికారుల అంచనా మేరకు వచ్చే జూన్‌ నాటికి పూర్తవుతాయి. లేని పక్షంలో మరింత ఆలస్యమవుతుంది.


గ్రేటర్‌లో లక్ష డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ శ్రీకారం చుట్టిన విషయం విదితమే. వీటిలో ఆయా ప్రాంతాల్లోని వివాదాలు తదితర అంశాలతో దాదాపు 2వేల ఇళ్ల పనులు ఇంకా ప్రారంభం కాలేదు. దాదాపు 8వేల ఇళ్ల నిర్మాణం పూర్తయింది. మరో 30వేల ఇళ్ల పనులు తుది దశలో ఉన్నాయి. సకాలంలో నిధులందితే వడివడిగా పూర్తయ్యే అవకాశం ఉంది. కానీ నిధుల లేమితో కొట్టుమిట్టాడుతుండడంతో పనులు మందకొడిగా సాగుతున్నాయి. చేసిన పనులకే దాదాపు రూ.800 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది.
సింగం చెరువు తండా, గాజులరామారం, అమీన్‌పూర్‌, జమ్మిగడ్డ, సయ్యద్‌ సాబ్‌కా బాడా, కిడికీ బూద్‌అలీసా, అహ్మద్‌గూడ, డీపోచంపల్లి, బహదూర్‌పల్లి–1, బహదూర్‌పల్లి–2, ఎరుకల నాంచారమ్మ బస్తీ , బోరబండ, మూసాపేట, ముషీరాబాద్, సికింద్రాబాద్, హమాలీబస్తీ, తదితర ప్రాంతాల్లోని బస్తీలను ఖాళీ చేయించి ఇళ్ల నిర్మాణం చేపట్టింది. జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు ముషీరాబాద్ లోని ఒక్క ప్రాంతంలోనే ఇళ్లను నిర్మించి ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం లబ్ధిపొందింది. ఆ ఎన్నికల్లోనే ఏడాదిలోగా లక్ష ఇళ్లను జీహెచ్ఎంసీ పరిధిలో నిర్మిస్తామని హామీ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకూ నిర్మాణం చేయకుండా పేదల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటుందని పలువురు విమర్శిస్తున్నారు. మరో ఏడాదిలోగా జీహెచ్ఎంసీ ఎన్నికలు రానున్న తరుణంలో నగర పేదలకు ప్రభుత్వం ఏ బూచీ చూపిస్తున్నదో వేచి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: