హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఇంకెన్ని ప్రాణాలు పోవాలో అర్ధం కావడం లేదు. ఇదివరకే హైదరాబాద్‌ లో ఉన్న షైన్ హాస్పిటల్‌‌లో అగ్ని ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందిన ఘటన మరువక ముందే అనంతపురంలో మళ్లీ ఇలాంటి దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే. హిందూపూరంలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ ఐసీయూలో అనుకోకుండా మంటలు చేలరేగడంతో మరో పసిప్రాణం ఆగ్నికి ఆహుతైయ్యింది..


కొట్నూరుకు చెందిన గర్భిణి ముబీనాబాను ప్రసవం కోసం శనివారం ఉదయం హిందూపూరంలోని ప్రభుత్వ హాస్పిటల్‌లో చేర్పించారు. ఆ బాలింతకు సాధారణ ప్రసవం కాకపోవడంతో వైద్యులు సిజేరియన్ చేసి శిశువును బయటకు తీశారు. ఆ శిశువు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.. అయితే, రాత్రి 11 గంటల సమయంలో ఐసీయూ విభాగంలో ఆక్సిజన్‌ అందించే ఎయిర్‌ కంప్రెసర్‌లోని కండెన్సర్‌లు కాలిపోయి మంటలు చెలరేగాయి. దీంతో ఒకసారిగా పొగలు వ్యాపించి, ఐసీయూ విభాగానికి ఆక్సిజన్‌ సరఫరా నిలిచిపోయింది.


దీంతో ఆ నవజాత శిశువు ఉక్కిరిబిక్కిరై మృతి చెందాడు.. ఇకపోతే శిశువు ఆరోగ్య పరిస్థితి అప్పటికే విషమంగా ఉండటంతో పొగలు అతన్ని ఊపిరాడకుండా చేసాయని అక్కడి వారు తెలుపుతున్నారు. ఇక ఈ ఘటనపై శిశువు తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. తమ బిడ్డ ప్రాణాలు హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యవల్లే పోయాయని, వారు సరిగ్గా స్పందించకపోవడం వల్లే ఇలా జరిగిందని, పసిబిడ్డ ప్రాణాలను దారుణంగా తీసారని వాగ్వాదానికి దిగారు.


వీరికి తోడుగా చికిత్సకోసం హాస్పిటల్‌కు వచ్చిన రోగులు సైతం ఆందోళనకు దిగారు. దీంతో హాస్పిటల్ ప్రాంగణంలో ఉద్రికత్త పరిస్దితి నెలకుంది. ఇక ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. బాధితులకు సర్దిచెప్పి పరిస్థితి చక్కదిద్దగా. ఈ ఘటనపై విచారణ జరిపించాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు తెలుస్తుంది.. నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణాలు బలి అవుతున్న వీటిపై అప్రమత్తంగా ఉండని వ్యవస్దను ఏం చేయాలో, ఎలాంటి చర్యలతో గాడిలో పెట్టాలో అర్ధం కాక ఇలాగే ఉంటే ఇంకెన్ని ప్రాణాలు పోవలసి వస్తుందో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: