తెలంగాణ ఆర్టీసీ చరిత్రలో ఎన్నడు ఎరుగని రీతిలో సమ్మె గత నెల రోజుల నుండి కొనసాగుతున్నా.. అయినా గాని ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడం.. అయినా గాని కార్మికులు బెట్టు వీడకపోవడంతో పరిస్థితిని మరింత తీవ్రతరంగా మారుతుంది. ఇకపోతే మరోవైపు సమ్మె కారణంగా ఉద్యోగాలు పోయాయన్న మనస్తాపంతో పలువురు కార్మికులు, వారి కుటుంబ సభ్యులు బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. మరికొందరి గుండెలు ఆలోచనలతో బలహీనంగా మారి ఆగిపోవడంతో ఆకస్మిక మరణాల పాలవుతున్నారు. ఫలితంగా వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.
ఇంతమంది మరణిస్తున్నా..ప్రభుత్వం చర్చల విషయంలో చొరవ చూపకపోవడం పలు వర్గాల ఆగ్రహానికి కారణమవుతోంది. సమ్మె మొదలైనప్పటి నుంచి జరిగిన ఆత్మహత్యల వివరాలను ఆర్టీసీ కార్మిక జేఏసీలు అందించాయి. వీటిలో 15 మంది ఆత్మహత్య చేసుకోగా.. ఐదుగురు గుండె ఆగి మరణించారు. ఇక ఇప్పుడు మరో కార్మికుడి మరణం వెలుగులోకి వచ్చింది. హన్మకొండ డిపోకు చెందిన రవీందర్కు నాలుగు రోజుల క్రితం గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు. దీంతో అతన్ని హైదరాబాద్లోని ఓ హాస్పిటల్కు తరలించారు.
అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రవీందర్ గత అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. దీంతో పోలీసులు భారీ కాన్వాయ్తో రవీందర్ మృతదేహాన్ని ఆయన స్వస్థలం వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరుకు తరలించారు. రవీందర్కు భార్య రజిత, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రవీందర్ మృతితో ఆర్టీసీ కార్మికులు పెద్త ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆత్మకూరులో పోలీసులు భారీగా బలగాలను మోహరించారు.. ఇతని మృతితో తెలంగాణ ఆర్టీసీ కార్మికుల విషాద మృతయాత్రలోని సంఖ్య పదహారుకు చేరింది.
ఇకపోతే ఆత్మహాత్యలకు సంబందించి మీడియా అడిగిన ప్రశ్నలకు సీఎం కేసీఆర్ నాటి సమైక్య సీఎంలు పలికినట్లుగా.. కార్మికుల ప్రాణాలు పోవడానికి ఆర్టీసీ కార్మిక యూనియన్లు, విపక్షాలే కారణమని మండిపడుతున్నారు. ఔరౌరా విధి ఎంతటి విచిత్రమైనది.. నాడు విపక్షంలో ఉన్నపుడు ఆత్మహత్యల విషయంలో ఆయా ప్రభుత్వాలను తప్పుబట్టిన కేసీఆర్ నేడు.. అధికారంలోకి వచ్చాక.. అవే మాటలను తిరిగి విపక్షాలపై ప్రయోగించడం చూసి విశ్లేషకులు ముక్కున వేలేసుకుంటున్నారు.