జనసేన...జగన్ సేన మధ్య రాజకీయ విమర్శల డోస్ పెరుగుతోంది..! పవన్ సినిమాల్లో చేసిన యాక్షన్ అంతా ఇప్పుడు రాజకీయాల్లో చేస్తున్నారని వైసీపీ నేతలు  ఆరోపిస్తున్నారు. పవన్, చంద్రబాబు ట్రాప్‌ లో పడి జగన్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. జగన్‌ పై కేసుల గురించి మాట్లాడుతున్న పవన్ కు ఆయనపై ఉన్న కేసుల గురించి తెలియదా? అని ప్రశ్నించారు. మరోవైపు వైసీపీ నేతల విమర్శలకు జనసేనాని కూడా స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. రోడ్డుమీదకొచ్చి బాహాబాహీ తేల్చుకుందామంటే తానెప్పుడూ రెడీ అన్నారు పవన్ కల్యాణ్.  


ఏపీలో ఇసుక కొరతతో మొదలైన రాజకీయ విమర్శలు తారాస్థాయికి చేరుతున్నాయి. వైసీపీని, జగన్‌ ను టార్గెట్  చేసుకుని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పిస్తుంటే... పవన్ కు అదే స్థాయిలో కౌంటర్ లు ఇస్తున్నారు వైసీపీ నేతలు, మంత్రులు. పవన్ కు ఆవేశం ఉంటే రాజకీయాలకు పనికిరారన్నారు మంత్రి అవంతి. పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్ ని తిట్టడమే ఎజెండాగా పెట్టుకున్నారని విమర్శించారు. పవన్ లా దిగజారి తాము కేసుల గురించి మాట్లాడమన్నారు.


పవన్ కల్యాణ్ సినిమాల్లో చూపించిన యాక్షన్ మొత్తం రాజకీయాల్లో ప్రదర్శిస్తున్నారని బొత్స విమర్శించారు. ఓటమిని ఒప్పుకోకుండా పవన్ పెద్ద పుడింగిలా మాట్లాడుతున్నారని పరోక్షంగా కామెంట్ చేశారు బొత్స. అటు కన్నబాబు కూడా పవన్ పై విరుచుకుపడ్డారు. చిరంజీవి వల్లే తాను రాజకీయాల్లో వచ్చానని.. కానీ పవన్ ఎప్పుడైనా చిరంజీవి కూడా రాజకీయాల్లో ప్రస్తావించారా అని ప్రశ్నించారు. 


వైసీపీ నేతల విమర్శలకు జనసేనాని స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. బాహాబాహీ తేల్చుకుందామంటే .. తాము  రెడీ అని సవాల్ విసిరారు.  రోడ్డు మీదకీ వచ్చి తేల్చుకుందామంటే జనసేన ఎప్పుడు రెడీగా ఉంటుందన్నారు. టీడీపీ జెండాను ఎజెండాను ఫాలో అవుతున్న పవన్ కల్యాణ్‌ను..చంద్రబాబు దత్తపుత్రుడిగా చెబితే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: