కాలం ఏదైనా హోటల్ ఫుడ్ అంటేనే భయపడే పరిస్దితులు తలెత్తుతున్నాయి. పైకి చూడూ అందంగా అలంకరించి హంగామా చేస్తూ కనిపించే హోటల్ కిచెన్స్లో చూస్తే జీవితంలో మళ్లీ ఆ ఫుడ్ తినాలంటే భయంతో వణికిపోవడం ఖాయం. ఇక హోటల్ ఫుడ్ తిని అస్వస్దతకు గురైన వారున్నారు. కోలుకోకుండా కొన్నాళ్లపాటు బెడ్ కు పరిమితమైన వారున్నారు. ఒక్కోసారి ఫుడ్ పాయిజన్ ఐతే ప్రాణాలు కూడ పోవచ్చూ. ఇంతలా చెబుతున్న ఈ కాలం వాళ్లు హోటల్స్లో తినడం మానడం లేదు.
ఇక మనం ఆర్డర్ చేసిన ఐటెం వాళ్లు ఫ్రెష్గా తెస్తారనే విషయం మనకు తెలియదు. అది ఫ్రెష్ అని అనుకోని తినేస్తాం. ఇలా తినడం వల్ల ఓ కుటుంబమే హస్పిటల్ పాలైంది. వివరాల్లోకి వెళ్లితే. వనస్థలిపురం, ఎన్జీవోస్ కాలనీ ప్రధాన రోడ్డులో సుబ్బుతో పాటు మరో ముగ్గురు కలిసి మిస్టర్ పులావ్ అనే హోటల్ను నిర్వహిస్తున్నారు. రెండ్రోజుల క్రితం ఈ హోటల్ నుండి వనస్థలిపురం, ఎన్జీవోస్ కాలనీకి చెందిన ఉమా, శ్రీనివాస్ దంపతులు బిర్యానీని ఆర్డర్ చేశారు.
ఇది తిన్న కుటుంబ సభ్యులందరికీ రాత్రంతా వాంతులు, విరేచనాలు కావటంతో ప్రైవేటు ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.. ఈ ఘటనపై అతని కుటుంబ సభ్యులు సోమవారం జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఫిర్యాదు అందుకున్న జీహెచ్ఎంసీ ఉప కమిషనర్ మారుతి దివాకర్రావు సిబ్బందితో కలిసి మిస్టర్ పులావ్ హోటల్లో తనిఖీలు చేపట్టగా, ఆ హోటల్లో అపరిశుభ్ర వాతావరణంతో పాటు, నిల్వ ఉంచిన కూరగాయలు, మాంసాన్ని గుర్తించారు.
దీంతో ఆగ్రహించిన ఉప కమిషనర్ సదరు హోటల్ నిర్వాహకులకు నోటీసులను జారీ చేసి రూ.50 వేల జరిమానాను విధించారు. నిర్ణీత సమయంలో జరిమానా చెల్లించకుంటే హోటల్ను సీజ్ చేస్తామని ఈ సందర్భంగా ఉప కమిషనర్ మారుతి దివాకర్రావు నిర్వాహకులను హెచ్చరించారు.