ప్రేమ కోసం ప్రేమికులు ఎన్నో త్యాగాలు చేసినట్లు చూశాం. అయితే ఇక్కడ మాత్రం ఓ ప్రియురాలు తన ప్రియుడి కోసం ఏకంగా దొంగగా మారిపోయింది. సొంత అక్క ఇంటికే కన్నం వేసి.. ప్రియుడిని ఆర్థికంగా నిలబెట్టాలని అనుకుంది. కానీ.. చివరకు ప్లాన్ బెడిసిగొట్టి పోలీసులకు అడ్డంగా దొరికిపోవడంతో కటకటాలపాలైంది. ఈ సంఘటన రామాంతపూర్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మెండు ఝాన్సీ(20) రామంతాపూర్లో తల్లిదండ్రులతో కలిసి జీవిస్తోంది. ఆమెకు ఒక సోదరి ఉండగా.. వివాహం జరిగింది. కాగా ఝాన్సీ గత కొంతకాలంగా రాహుల్(21) అనే వ్యక్తిని ప్రేమిస్తోంది. అతను బంజారాహిల్స్ లో ఉంటూ ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు.
ఇటీవల రాహుల్ కి బాగా డబ్బు అవసరం పడింది. ఈ విషయాన్ని తన ప్రేయసి ఝాన్సీకి చెప్పాడు. అయితే తన ప్రియుడి డబ్బు అవసరం ఎలాగైనా తీర్చాలనుకుని ఓ మాస్టర్ ప్లాన్ వేసింది. ఈ క్రమంలోనే ఫీర్జాదిగూడ బుద్ధానగర్లో ఉంటున్న తన అక్క ఇంటికి ఝాన్సీ వెళ్లింది. ఆమె ఇంట్లో లేని సమయంలో బీరువా నుంచి బంగారు నగలు అపహరించి రాహుల్కు ఇచ్చింది. అతడు తన స్నేహితుడు నిఖిల్(21)తో కలిసి వాటిని విక్రయించి తన అవసరాలు తీర్చుకున్నాడు. అయితే బంగారం పోయిందని లబోదిబోమంటూ బాధితురాలు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది.
అయితే నగలు పోయాయని గుర్తించినా చెల్లెలిని ఏమాత్రం అనుమానించలేదు. ఝాన్సీ కూడా ఏమీ ఎరగనట్టే నటించింది. మరోవైపు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. అయితే పోలీసులు ఝాన్సీని అనుమానించి, తమదైన శైలిలో విచారణ చేయడంతో సదరు మహిళా నేరాన్ని అంగీకరించక తప్పలేదు. చెల్లెలే దొంగతనం చేసిందని తెలిసి ఆమె అక్క షాక్కి గురైంది. కాగా, రాహుల్, నిఖిల్, ఝాన్సీని మంగళవారం అదుపులోకి తీసుకొని నాలుగు తులాల బంగారు నగలు స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు.