నది లేనిదే నాగరికత... భాష లేనిదే సంస్కృతి లేవని, అయితే...మన భాష మూలాలను మనమే నరికేసుకుంటున్నాని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మాతృ భాష పరిరక్షణ... నదుల సంరక్షణకు జనసేన ఆధ్వర్యంలో `మన నుడి... మన నది` పేరుతో వినూత్న కార్యక్రమం చేప‌ట్ట‌నున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు. నాగరికతకు పుట్టినిల్లయిన నదులను విషమయం చేసుకోవడం బాధాకరమని ప‌వ‌న్ పేర్కొన్నారని అందుకే నూత‌న కార్య‌క్ర‌మం చేప‌ట్టార‌ని జ‌న‌సేన పార్టీ అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. 

 

మాతృ భాషను, నదులను పరిరక్షించుకొనే దిశగా 'మన నుడి... మన నది' కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. 'మన భవితకు ప్రాణాధారమైన మాతృ భాషను కాపాడుకోకపోతే సంస్కృతికి దూరమవుతామని జనసేన అధ్యక్షుడు స్పష్టం చేశారు. ఈ విషయమై పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ "నాగరికతకు పుట్టినిల్లు నది. నది లేనిదే సంస్కృతి లేదు. నది నశించాక ఆ సంస్కృతి మిగలదు. దీనికి చరిత్రలో కావలసినన్ని రుజువులున్నాయి. నాగరికతకు అమ్మ ఒడి నుడి. భాష లేనిదే సంస్కృతి లేదు. మాతృభాష గతించాక సంస్కృతి మిగలదు. దీనికి చరిత్రలో బోలెడు రుజువులు కనిపిస్తాయి. మన మనుగడకు జీవనాధారమైన నదులను మనం చేతులారా విషమయం చేస్తున్నాం. మన భవితకు ప్రాణాధారమైన అమ్మనుడికీ మనం అతివేగంగా దూరమవుతున్నాం. మాతృ భాష మూలాలను మనమే నరికేసుకుంటున్నాం. మన నుడినీ, మన నదిని కాపాడుకోవాలి. అందుకే విజ్ఞులు, మేధావులతో ఈ అంశంపై చర్చించాం. మాతృ భాషను పరిరక్షించుకోవాలి. మన నదులను కాపాడుకోవాలి. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలవారినీ భాగస్వాముల్ని చేసేలా “మన నుడి... మన నది” కార్యక్రమం చేపడుతున్నాం. ఇందుకు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం` అని తెలిపారు.

 

జ‌న‌సేన చేప‌ట్ట‌బోయే ఈ కార్య‌క్ర‌మంపై స‌హ‌జంగానే ఆస‌క్తి నెల‌కొంది. గ‌త కొద్దికాలంగా ఏపీలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్ట‌బోయే ఆంగ్ల‌మాధ్య‌మంపై ప‌వ‌న్ మండిప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఇలాంటి త‌రుణంలో... “మన నుడి... మన నది” కార్యక్రమం గురించి రాజ‌కీయంగా...కొత్త చ‌ర్చ జ‌రుగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: