రెండు వేల నోటు ఏమయ్యింది..? బ్యాంకుల్లో లేవు... ఏటీఎంల్లో రావట్లేదు...! చూద్దామన్నా.. కనబడదు. 500, 1000 రూపాయల నోట్ల రద్దు తర్వాత... పింక్‌ కలర్‌ లో తలతలలాడిన రెండు వేల నోటు మాయమవుతోంది. అసలేమయినట్టు.. ఎక్కడున్నట్టు..!!  

 

500, 1000 రూపాయల నోట్ల రద్దు తర్వాత... ఆర్‌బీఐ రెండు వేల నోటును చలామణిలోకి తీసుకొచ్చింది. పింక్‌ కలర్‌లో... చిన్న సైజులో ఉండే రెండు వేల నోటు తలతలలాడింది. కానీ... ఇప్పుడు అదే నోటు కానరాకుండా పోయింది. చూద్దామన్నా.. కనిపించకుండా పోతోంది. బ్యాంకుల్లో లేవు... ఏటీఎంల్లో కూడా 500, 100, 200 నోట్లు తప్ప... 2 వేల నోట్లు రావడం లేదు. 
ఇంతకూ రెండు వేల నోటు ఏమయినట్టు... ! డిపాజిట్ల రూపంలో వచ్చే నోట్ల కట్టల్లో కూడా రెండు వేల నోట్లు పెద్దగా కనిపించడం లేదంటున్నారు బ్యాంక్‌ అధికారులు. బ్యాంకుల నుంచి బయటకెళ్లిన రెండు వేల నోటు... తిరిగి బ్యాంకుకు చేరడం లేదు. 

 

బ్లాక్‌ మనీని అరికట్టేందుకు కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం... ఫలించినట్టే అనిపించినా.. రెండు వేల నోటు తీసుకురావడం వరంగా మార్చుకున్నారు. 100 రూపాయలు, 200 నోట్లు, 500 నోట్ల కట్టల గుట్టలు పెట్టుకునే కంటే... రెండు వేల నోట్ల కట్టలు ఈజీగా దాచుకునేలా మారింది. రెండు వేల నోట్లు చేతికందడమే ఆలస్యం... వెంటనే బీరువాల్లోకి చేరాల్సిందే తప్ప బ్యాంకుల్లోకి కానీ.. వాడకంలోకి కానీ రావట్లేదు. 

 

ఆర్‌బీఐ రెండు వేల నోట్ల ముద్రణ నిలిపివేసింది. త్వరలో రెండు వేల నోట్ల రద్దు జరుగుతుందనే పుకార్లు వినబడుతున్నా.. రెండు వేల నోటు మాత్రం కట్టవీడి బయటకు రాలేదు. నల్లధనం జమ చేసుకునే వాళ్లంతా రెండు వేల నోటును బీరువా దాటి బయటకు వదలట్లేదు. దీంతో... రాను రాను రెండు వేల నోటు కనుమరుగవుతోంది. రెండు వేల నోటే కాదు... బ్యాంకుల్లో డిపాజిట్లు సైతం గణనీయంగా తగ్గాయంటున్నారు బ్యాంక్‌ అధికారులు. డబ్బులు ఇంట్లోనే దాచుకుంటున్నారు తప్ప.. బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయడం లేదంటున్నారు. ట్యాక్స్‌లు కట్టాల్సి వస్తుందేమోనని... ఇల్లీగల్‌ మనీ అని ఎక్కడ తెలిసిపోతుందో అని ఇంట్లోనే భద్రపరుచుకుంటున్నారు. మరోవైపు బ్యాంకుల నుంచి పెద్దమొత్తంలో డబ్బులు విత్‌ డ్రా చేసుకుని వెళ్లే ఖాతాదారులకూ ఇబ్బందులు తప్పడం లేదు. ఎక్కువగా వంద, రెండు వందల నోట్లే ఇస్తున్నారు. వీటిని తీసుకువెళ్లడం సమస్యగా మారింది. నోట్ల కట్టల భద్రత విషయంలో ఆందోళన చెందుతున్నారు. 


పన్నులు ఎగవేసేందుకు, మనీల్యాండరింగ్‌కు రెండు వేల నోట్లను కొన్ని వర్గాలు దుర్వినియోగం చేస్తుండటంతో.. కేంద్రం ముద్రణ నిలిపివేసింది. ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం 2017 మార్చి ఆఖరు నాటికి చలామణీలో ఉన్న 2 వేల నోట్ల సంఖ్య సుమారు 329 కోట్లు కాగా.... ఏడాది తర్వాత 2018 మార్చి ఆఖరు నాటికి ఇది స్వల్పంగా పెరిగి 337 కోట్ల నోట్లకు చేరింది.  2017 మార్చి ఆఖరు నాటికి మొత్తం కరెన్సీ విలువలో రెండు వేల నోట్ల వాటా 50.2 శాతంగా ఉండగా.. 2018 మార్చి ఆఖరు నాటికి ఇది 37.3 శాతానికి తగ్గింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: