ఎవడు కొడితే...దిమ్మ తిరిగి మైండ్ బ్లాంకవుద్దో అనే పాపులర్ సినిమా డైలాగ్ ఇప్పుడు సరిగ్గా...ఎన్సీపీ అధినేత శరద్ పవార్ విషయంలో వర్తిస్తుందని అంటున్నారు. ఏకకాలంలో ఇటు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి, అటు శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రేకు షాక్ ఇవ్వడమే కాదు మైండ్ బ్లాంక్ చేసేశారు. నిన్న సాయంత్రం వరకూ కాంగ్రెస్, శివసేనతో చర్చలు జరిపిన పవార్.. ఉద్ధవ్ థాక్రే సీఎంగా ఉంటారని కూడా ప్రకటించారు. అయితే రాత్రికి రాత్రి ఏం జరిగిందో కానీ.. తెల్లారేసరికి సీన్ మొత్తం పూర్తిగా మారిపోయింది.
మహారాష్ట్రలో గత నెల అక్టోబర్ 24న ఫలితాలు వచ్చాయి అంటే దాదాపుగా ఎన్నికల ఫలితాలు వచ్చి నెల రోజులు గడిచింది. . అక్టోబర్ 21వ తేదీన జరిగిన ఎన్నికల్లో బీజేపీ-శివసేన పొత్తు పెట్టుకుని పోటీ చేశాయి. బీజేపీ 105, శివసేన 56 సీట్లు గెలుచుకున్నది. ఇక ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 సీట్లు గెలుచుకున్నాయి. నిజానికి బీజేపీ-శివసేన కూటమి మ్యాజిక్ మార్క్ను దాటింది. కానీ సీఎం పదవి విషయంలో ఆ రెండు పార్టీల మధ్య విబేధాలు వచ్చాయి. సీఎం పదవిని పంచుకోవాలని శివసేన పట్టుపట్టింది. కానీ బీజేపీ ఆ షరతుకు అంగీకరించలేదు. దీంతో మహారాష్ట్రలో ప్రతిష్టంభన నెలకొంది. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు 145 సీట్లు కావాలి. బీజేపీకి 105 మరియు ఎన్సీపీకి 54 సీట్లు ఉన్నాయి. మొత్తం కలిపి 159 సీట్లు అవుతున్నాయి. దీంతో బీజేపీ చక్రం తిప్పింది.
రోజు రోజుకో మలుపు తిరుగుతున్న మహారాష్ట్ర రాజకీయానికి బీజేపీ అంతిమ గీతం పాడింది. రాత్రికి రాత్రి మహారాజకీయం పూర్తిగా మారిపోయింది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని అందరూ అనుకున్నారు. కానీ, దానికి భిన్నంగా.. ఎవరూ ఊహంచని విధంగా బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవిస్ సీఎంగా రాజ్భవన్లో గవర్నర్ కోశ్యారీ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఫడ్నవిస్ మహారాష్ట్రకు రెండోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. బీజేపీకి.. ఎన్సీపీ మద్ధతు ప్రకటించడంతో బీజేపీకి లైన్ క్లియర్ అయ్యింది. ఎన్సీపీ నేత అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.
అయితే, దీనికి ముందే..చాలా తతంగం నడిచింది. గ్రౌండ్ ప్రిపేర్ అయిపోయింది. ఇటీవల రాజ్యసభలో 250వ సెషన్ సందర్భంగా ప్రధాని మోదీ తన ప్రసంగంలో ఎన్సీపీ పార్టీని మెచ్చుకున్నారు. శరద్ పవార్కు చెందిన ఆ పార్టీ గత సమావేశాల్లో ఎటువంటి అల్లరి చేయలేదన్నారు. వెల్లోకి దూసుకువెళ్లకుండానే.. తమ డిమాండ్లను తీర్చుకున్నట్లు ఆయన గుర్తు చేశారు. ఎన్సీపీ ఇచ్చిన సపోర్ట్ మరువలేనిదని మోదీ అన్నారు. ఆ తర్వాత రోజే ప్రధాని మోదీ, శరద్ పవార్లు భేటీ అయ్యారు. ఆ భేటీలో మహారాష్ట్ర ప్రతిష్టంభన ఓ కొలిక్కి వస్తుందని భావించారు. కానీ ఎటువంటి ప్రకటన వెలుబడలేదు. కేవలం రైతుల సమస్యల గురించి మాట్లాడినట్లు శరద్ తెలిపారు. ఆ తర్వాత శివసేన చొరవతో ఎన్సీపీ, కాంగ్రెస్లు .. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నించాయి. కాంగ్రెస్ నేత సోనియాతోను కూడా శరద్ పవార్ కలిశారు. శుక్రవారం రాత్రి కూడా ఈ మూడు పార్టీలు భేటీ అయ్యాయి. కానీ శనివారం ఉదయం మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువైంది. ఉదయం 8 గంటలకు ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణం చేశారు. డిప్యూటీగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు