ఇది నిజంగా అందరికీ ఆశ్చర్యం కలిగించే అంశమేనని చెప్పాలి. మహారాష్ట్రలో శివసేనతో కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని అందరూ భావించారు. కానీ తెల్లారేసరికి మహారాష్ట్ర సీఎం గా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. రెండు రోజుల క్రితం ప్రధాని మోడీతో ఎన్సీపీ అధినేత పవార్ తో భేటీ కావటం.. మహారాష్ట్ర రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఆయనతో చర్చలు జరిపానే తప్పించి మరింకేమీ లేదన్న ఆయన.. అనూహ్యంగా వేసిన ఎత్తుతో శివసేన చిత్తు అయ్యింది. అధికారం తమ చేతి నుంచి చేజారేందుకు ఏ మాత్రం అవకాశం ఇవ్వని మోడీషాలు.. తాజాగా తామేమిటన్నది మహారాష్ట్ర విషయంలో చేతల్లో చేసి చూపించారు.

 

నిజానికి నిన్న రాత్రి కూడా శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే సీఎంగా ఖరారని కూటమి కూడా చెప్పింది. శుక్రవారం రాత్రి.. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్దవ్ ఠాక్రే బాధ్యతలు స్వీకరిస్తారని పవార్ స్వయంగా ప్రకటించిన గంటల వ్యవధిలోనూ అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవటం.. శనివారం ఉదయం (8.30 గంటల సమయానికే) మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్రఫడ్నవీస్ ప్రమాణస్వీకారం పూర్తి కావటం షాకింగ్ గా మారింది. డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్ ప్రమాణస్వీకారం చేశారు.  శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకూ చోటు చేసుకున్న వరుస పరిణామాలతో ఈ పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. శివసేనతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని..ఐదేళ్ల పాటు ఉద్దవ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని.. సీఎం పదవిని పంచుకునే మాట తమ చర్చల్లో రాలేదన్న పవార్.. రాత్రికి రాత్రే ప్లేట్ మార్చేయటమే కాదు.. తెల్లారేసరికి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేశారు.

 


ఎన్సీపీ అధినేత పవార్ సమక్షంలోనే ఈ తతంగం నడిచి ఉంటుందని తెలుస్తుంది. పవార్ కు తెలియకుండా చీలిక సాధ్యపడదని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఒకవైపు సేనతో చర్చలు జరుపుతూనే.. మరోవైపు ప్లాన్ బీ అన్న రీతిలో తమ పార్టీ నేత అజిత్ పవార్ తో కలిసి బీజేపీతో రహస్య మంతనాలు జరిపిన పవార్.. చివరకు మహారాష్ట్ర ఎపిసోడ్ కు అనూహ్య ముగింపు ఇవ్వటం గమనార్హం. రాత్రికి రాత్రి చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఫడ్నవీస్ మాట్లాడుతూ.. అసెంబ్లీలో తమకు సంపూర్ణ మెజార్టీ ఉందన్నారు. సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని.. మహారాష్ట్ర ప్రజల సమస్యల్ని తాము పరిష్కరిస్తామని ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: