ప్రధాని నరేంద్ర మోడీ ఖాతాలలో డబ్బువేస్తాడని ప్రజలు వేలంవెర్రిగా ఖాతాలను సిద్ధం చేస్తున్నారు. అయితే తన ఖాతాలోకి నెలనెలా డబ్బులు వచ్చిపడుతుంటే హామీ ఇచ్చిన ప్రకారం మోదీ వేస్తున్నారు కాబోలు అనుకున్నాడో వ్యక్తి. ఆ డబ్బుతో తన అవసరాలు తీర్చుకున్నాడు. అయితే మరో వ్యక్తి పిర్యాదు చేయడంతో అసలు విషయం తెలుసుకున్న బ్యాంక్ సిబ్బంది షాక్కు గురైంది. వివరాల్లోకి వెళ్తే.. భింద్ జిల్లాలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో రురై గ్రామానికి చెందిన హుకుమ్ సింగ్, రోని గ్రామానికి చెందిన హుకుమ్ సింగ్ అనే ఇద్దరు వేర్వేరు వ్యక్తులు ఒకే బ్యాంక్లో తమ ఖాతాలను తెరిచారు.
ఇద్దరి పేర్లు ఒకటే కావడంతో బ్యాంకు అధికారులు పొరపాటున ఇద్దరికీ ఒకటే ఖాతా నంబరు కేటాయించారు. అయితే ఓ గ్రామానికి చెందిన హుకుమ్సింగ్ బ్యాంకులో దాచుకుంటున్న డబ్బులు మరో హుకుమ్సింగ్ ఖాతాలో జమ అవుతున్నాయి. దీంతో తన ఖాతాలోకి వస్తున్న డబ్బును చూసిన హుకుమ్ సింగ్.. 2014 ఎన్నికల్లో మోదీ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నారని అనుకున్నాడు. ఈ క్రమంలోనే తన బ్యాంక్ ఖాతాలో పడుతున్న డబ్బుతో అవసరాలు తీర్చుకునేవాడు.
ఇలా ఆరు నెలల కాలంలో మొత్తం 89 వేల రూపాయలు డ్రా చేసుకున్నాడు. అయితే ఇటీవల డబ్బులు అవసరమైన అసలు హుకుమ్సింగ్ డబ్బులు డ్రా చేసుకునేందుకు బ్యాంకుకు వెళ్లగా, అందులో రూ.35 వేలు మాత్రమే ఉండడంతో లబోదిబోమంటూ అధికారులను ఆశ్రయించాడు. ఇదేమంటూ బ్యాంకు అధికారులను ప్రశ్నించారు హుకుమ్ సింగ్. దీంతో బ్యాంకు అధికారులు తమ తప్పును తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే డబ్బులు వాడుకున్న హుకుమ్సింగ్ను పిలిచి అసలు విషయం చెప్పి డబ్బుల కోసం ప్రశ్నించారు. దీంతో తనకేమీ తెలియదని చెప్పాడు.
విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రజల ఖాతాల్లో వేస్తానని మోదీ హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశాడు. అందులో భాగంగానే ప్రధాని నరేంద్ర మోడీ నా ఖాతాలో డబ్బులు వేస్తున్నారనుకున్నాను. అందుకే వాటిని వినియోగించుకున్నా అని అతడు అమాయకంగా సమాధానం చెప్పడంతో బ్యాంకు అధికారులు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.