ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా...గ‌లం విప్పుతున్న జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..టీడీపీ సీనియ‌ర్ ఒక‌రు మ‌ద్ద‌తు ప‌లికారు. ప‌వ‌న్ నిర్ణ‌యం అభినంద‌నీయ‌మ‌ని పేర్కొంటూ...త‌న మ‌ద్ద‌తు ఉంటుద‌ని హామీ ఇచ్చారు. జ‌గ‌న్‌ ప్ర‌భుత్వం వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం నుంచి ఆంగ్ల మీడియం ప్ర‌వేశ‌పెట్ట‌డాన్ని నిర‌సిస్తూ...ప‌వ‌న్ చేప‌ట్టిన మన నది - మన నుడి ఉద్యమానికి టీడీపీ నేత మండ‌లి బుద్ధ‌ప్ర‌సాద్ మ‌ద్ద‌తిచ్చారు. శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ ప్రశాసన్ నగర్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో ప్రముఖ కవి, సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరావుతో కలసి పవన్ కళ్యాణ్‌ను క‌లిసిన బుద్ధ‌ప్ర‌సాద్ ప‌వ‌న్ ప్ర‌య‌త్నానికి సంఘీభావం తెలిపారు.

 

 


ప‌వ‌న్‌తో భేటీ అనంత‌రం ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ ఉప సభాపతి మండలి బుద్దప్రసాద్ మాట్లాడుతూ...రాజకీయాలకు అతీతంగా, తెలుగు జాతిలో పుట్టిన ప్రతి ఒక్కరూ తెలుగు భాష పరిరక్షణ కోసం ఉద్యమించే వారికి మద్దతు పలకాలని పిలుపునిచ్చారు. ఒక రాజకీయ పార్టీగా మాతృ భాష విషయంలో జనసేన అధ్య‌క్షుడు పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఈ విషయంలో మిగిలిన పార్టీలు కూడా ఆయన్ను అనుసరిస్తే భాషకు మహోపకారం చేసిన వారిమవుతామన్నారు. ``పవన్ కళ్యాణ్ తెలుగు భాష పరిరక్షణ కోసం నడుంకట్టి, మన నుడి - మన నది కార్యక్రమాన్ని ప్రారంభించి తెలుగు భాషోద్యమానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న సమయంలో ఓ తెలుగు భాషాభిమానిగా వారిని హృదయపూర్వకంగా అభినందించడం జరిగింది. ఆంగ్ల మాధ్యమం పట్ల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సమగ్రమైన తెలుగు వ్యక్తిత్వ నిర్మాణానికి కృషి చేస్తున్నారు. భాషతో ఏర్పడిన జాతి తెలుగు జాతి. భాష ఎప్పుడైతే నశిస్తుందో అప్పుడు జాతి నశిస్తుందన్న విషయాన్ని గుర్తించి మన భాషను కాపాడుకోవడానికి ముందుకు వచ్చినందుకు సంతోషం. తెలుగు భాష మనుగడ కోసం ఉద్యమించాల్సిన పరిస్థితులు ప్రభుత్వం కల్పించింది. ఈ సవాలును మనం ధీటుగా ఎదుర్కొని జాతిని మేల్కొలిపి, భాషను సంరక్షించుకుని, జాతిని నిలబెట్టుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి. అదే ఆలోచనను పవన్ కళ్యాణ్ వివరించారు.  ఒక భాషాభిమానిగా ఆయనకు నా వంతు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తా. తెలుగు భాష అభిమానులంతా ఒక సమైక్య వేదిక ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది`` అని అన్నారు.

 

జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మాట్లాడుతూ..పవన్ కళ్యాణ్‌తో భాషాభివృద్ధికి సంబంధించి అనేక అంశాలపై చర్చించామ‌ని తెలిపారు. ప‌వ‌న్ బలమైన సంకల్పంతో తెలుగు భాష పరిరక్షణ, నదుల కాలుష్యాన్ని నివారించేందుకు కంకణం కట్టుకున్నారని...అందుకు అన్ని వర్గాల వారు, ప్రకృతి ప్రేమికులు, భాషా ప్రేమికులు, పండితులు, కవులు కలసి రావాలని కోరారు. ``పవన్ కళ్యాణ్ ముందుండి అందరితో కలసి ఉద్యమిస్తానని పిలుపునిచ్చారు. ఆ పిలుపున‌కు ప్రతిస్పందనగా ఆయన్ని కలవడం జరిగింది. నదీ పర్యావరణ పరిరక్షణ, భాషా పరిరక్షణ కార్యక్రమాలపై  ఆంగ్ల మాధ్యమంలో జాతి కొట్టుకుపోకుండా తెలుగు భాషతో పాటు ఆంగ్ల భాషను మన విద్యార్ధులకు అందించడం ఎలా? తెలుగు సంస్కృతి సంప్రదాయాలను నిలుపుకోవడం ఎలా? దీనికి మనవంతు మనం చేయాల్సింది ఏమిటి? అనే అంశాల మీద చర్చ జరిగింది. పవన్ కళ్యాణ్  తీసుకున్న నదీ పరిరక్షణ-భాషా పరిరక్షణ ఉద్యమానికి నా సంపూర్ణ మద్దతు ఇస్తున్నాను. ఈ అంశంలో నిరంతరం వారితో కలసి నా శక్తి సామర్ధ్యాల మేరకు వారి విజయానికి సహకరిస్తాను. పండితులు, కవులు తరలివచ్చి భాషా పరిరక్షణ ఉద్యమానికి మద్దతు తెలపాలి" అని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: