ఓ వైపు ఉల్లి ఘాట్ సామాన్య జనాన్ని వెర్రెత్తిస్తోంది. ఉల్లి లొల్లితో జనం గుక్కపట్టి ఏడుస్తున్నారు. మరో వైపు రాజకీయ వైకుంఠ పాళీలో పరమ పధ సోపానం దక్కించుకోవడానికి నేతల లొల్లికి ఉల్లి కంటే ఎక్కువగా మారి ఎమ్మెల్యేలకు డిమాండ్ పెంచుతోంది. క్షణక్షణానికి ఎమ్మెలేల రేటు పెరిగిపోతోంది.
అది మహారాష్ట్ర రాజకీయ ముఖచిత్రం. అక్కడ ఎమ్మెల్యల క్యాంప్ రాజకీయాలు షురూ అయ్యాయి. ఇప్పటికే రిసోర్ట్స్, హొటళ్ళలో ఎమ్మెల్యేలు బంధీలైపోయారు. వారి చుట్టూ కాపలా చాలా ఎక్కువగా ఉంది. అయినా కూడా కాంగ్రెస్ క్యాంప్ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు మిస్ అయ్యారన్న వార్తలు ఖద్దరు నేతలను కలవరపెడుతున్నాయి. మరో వైపు ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ వెంట నడవడానికి చాలా మంది ఎమ్మెల్యేలు సిధ్ధంగా ఉన్నారని భోగట్టా.
మరో వైపు ఆయన్ని బుజ్జగించేందుకు ఆయన బాబాయ్ శరద్ పవార్ రాజకీయం చేస్తున్నారు. రాయబారాలు నడుపుతున్నారు. అయినా కూడా అజిత్ పవార్ ఎక్కడా లొంగడంలేదు. బాబాయ్ ఎత్తులు ఆయనకు తెలుసు. ఒకసారి వెనక్కి జారితే పాతాళంలోకి వెళ్ళిపోతామని ఆయనకు తెలుసు. అందువల్ల ఆయన నో అని చెప్పేశారు.
మరోవైపు శివసేన సైతం నానా అగచాట్లు పడుతోంది. ఆ పార్టీ నుంచి కనీసంగా 20 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేతులు కలపడానికి రెడీగా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మొత్తానికి మహా రాజకీయం చూస్తుంటే ఎమ్మెల్యే రాయబేరాలు ఒక రేంజిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇంకో వైపు సుప్రీంకోర్టు సైతం బలపరీక్షకు గడువు విధించకపోవడంతో విపక్ష కూటమికి పెద్ద దెబ్బగా కనిపిస్తోంది. దీంతో విపక్ష శిబిరం ఠారెత్తిపోతోంది.
ఉన్నవారికి ఎలా కాపాడుకోవాలో తెలియక నాన అగచాట్లు పడుతోంది. ఓ వైపు కేంద్రంలో, మరోవైపు కొత్తగా రాష్ట్రంలో బీజేపీకి అధికారం దక్కింది. దాంతో ఆ పార్టీ వేసిన పాచికలకు ప్రతిపక్షం విలవిలలాడాల్సివస్తోంది.