తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా...దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు నోట్లు కేసు మళ్లీ తెరమీదికి వచ్చింది. రాష్ట్ర విభజన అనంతరం 2015లో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు డబ్బు ఆశజూపి ఆయన ఓటును కోనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తూ అప్పటి టీడీపీ ఎమ్మెల్యే, ప్రస్తుత కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి రెడ్హ్యాండెడ్గా దొరికిన విషయం తెలిసిందే. ఈ కేసులో స్టీఫెన్తో చంద్రబాబు కూడా ఫోన్లో మాట్లాడిన ఆడియో టేపులు బయటబడ్డాయి. ఆ టేపులు నిజమైనవేనని, అతికించినవి కాదని ఫోరెన్సిక్ పరీక్షల్లో తేలింది. అయితే, తాజాగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి(ఆర్కే) ఓటుకు నోటు కేసులో ఎర్లీ హియరింగ్ పిటీషన్ను ఈరోజు సుప్రీంకోర్టులో దాఖలు చేయడం సంచలనంగా మారింది. 2017లోనే ఈ పిటీషన్ దాఖలు చేసినా.. సుప్రీంకోర్టులో లిస్టింగ్ కాకపోవడంతో ఆర్కే మరోమారు సుప్రీం గడప తొక్కారు.
ఓటుకు నోట్లు కేసులో ఏపీ సీఎం చంద్రబాబు గొంతుకు సంబంధించి ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా కేసును విచారించాలని వైసీపీ ఎమ్మెల్యే (మంగళగిరి) ఆళ్ల రామక్రిష్ణారెడ్డి వేసిన పిటిషన్ను ఏసీబీ కోర్టు విచారణకు స్వీకరించింది. ఆయన తరపు న్యాయవాది వాదనలపై కోర్టు ఏకీభవించింది. చంద్రబాబు స్వరంపై ఫోరెన్సిక్ రిపోర్టును రామక్రిష్ణారెడ్డి కోర్టు ముందుంచారు. ఈ నివేదిక ప్రకారం కేసును మళ్లీ విచారణ జరిపించాల్సిందిగా ఆయన కోర్టుకు విజ్ఞప్తి చేశారు. పిటిషనర్ వాదనతో కోర్టు ఏకీభవించింది. అయితే, దీనిపై చంద్రబాబు కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. దీంతో మళ్లీ ఆయన సుప్రీం తలుపుతట్టి విచారణ జరపాలని కోరారు. అయితే, ఇప్పటికీ ఈ కేసులో పురోగతి లేకపోవడంతో....విచారణలో జాప్యం చోటుచేసుకోకుండా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో ఎర్లీ హియరింగ్ పిటీషన్ దాఖలు చేశారు.
ఓటుకు నోటు కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ సీఎం చంద్రబాబుకు, ఎంపీ రేవంత్రెడ్డికి తాత్కాలిక ఊరట లభించినప్పటికీ మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే దాఖలు చేసిన ఈ ఎర్లి హియరింగ్ పిటిషన్ ఊహించని షాక్ వంటిదని అంటున్నారు. త్వరితగతిన విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు న్యాయస్థానం దర్యాప్తు సంస్థలను ఆదేశిస్తే...ఆ మేరకు విచారణ సాగితే...ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అడ్డంగా ఇరుక్కుపోవడం ఖాయమంటున్నారు. ఇప్పటికే ఇటు పార్టీకి ముఖ్యనేతలు గుడ్ బై చెప్పేస్తుండటం, రాబోయే ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలా అనే సందేహంలో ఉన్న చంద్రబాబుకు ఈ విచారణ మరింత ఆందోళన కలిగించే అంశమని పేర్కొంటున్నారు.