చంద్రబాబునాయుడు రాష్ట్రవ్యాప్తంగా పర్యటనల్లో చేస్తున్న ఆరోపణలు, విమర్శలు వింటుంటే ఆశ్చర్యంగా ఉంది. చంద్రబాబు రాష్ట్ర పర్యటనల్లో ముఖ్య ఉద్దేశ్యమే జగన్మోహన్ రెడ్డిపై బురద చల్లటమే అని తెలిసిపోతోంది. విచిత్రమేమిటంటే ఏ జిల్లాలో పర్యటించినా చేస్తున్న ఆరోపణలు, విమర్శలు మాత్రం ఒకటిగానే ఉంటున్నాయి.
1- అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే జగన్ అమరావతి స్పూర్తిని చంపేశాడు. తాను రూ. 2 లక్షల కోట్ల సంపదను సృష్టిస్తే జగన్ దాన్ని నాశనం చేసేశాడు.
2- పోలవరం రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రభుత్వంపై రూ. 7500 కోట్ల భారాన్ని మోపాడు
3- విద్యుత్ రంగంలో పిపిఏ సమీక్షల పేరుతో దేశంలోనే కాదు ప్రపంచంలోనే రాష్ట్రానికి చెడ్డపేరు తీసుకొచ్చాడు.
4-పరిశ్రమల ఏర్పాటుకు తాను 24 గంటలూ కష్టపడితే జగన్ ఒక్క దెబ్బతోనే అన్నింటినీ వెనక్కుపోయేట్లు చేశాడు.
5-జగన్ కారణంగానే లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వెనక్కువెళ్ళిపోవటంతో లక్షలాది ఉద్యోగావకాశాలు దెబ్బతిన్నాయి.
6-ఇసుక పాలసీ వల్ల కొరత వచ్చేసి 35 లక్షలమంది భవన నిర్మాణ కార్మికులు పనులు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. ఇసుక కొరత వల్లే 50 మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు.
7-వరదల నియంత్రణలో ప్రభుత్వం విఫలమై కరకట్ట మీద తానుంటున్న నివాసాన్ని ముంచేయాలని కుట్ర చేశారు.
8-తమ పార్టీ నేతలు చేసిన కాంట్రాక్టుల తాలూకు కోట్లాది రూపాయల బిల్లులను ఆపేసి ఆర్ధికంగా దెబ్బ కొడుతున్నారు
ఇక పార్టీ పరంగా చూస్తే ప్రభుత్వ విధానాలను ప్రశ్నించిన తమ ఎంఎల్ఏలపై కేసులు పెడుతున్నారు.
9-వందలాది మంది కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు.
10-టిడిపి నేతలు, కార్యకర్తలపై రాజకీయ వేధింపులు, కక్షసాధింపులను సమర్ధవంతంగా ఎదుర్కొంటాం
ఇవి...చంద్రబాబు గడచిన ఐదు నెలలుగా జగన్ కు వ్యతిరేకంగా వేస్తున్న అరిగిపోయిన రికార్డులు. ఎక్కడ చెప్పినా ఎలాగ చెప్పిన సారంశం మాత్రం ఒకటే. జగన్ కు పరిపాలన చేతకాదు కాబట్టి తక్షణమే కుర్చీలో నుండి దిగిపోవాలి. వెంటనే అంటే 23 మంది ఎంఎల్ఏలతోనే తాను అధికారం చేపట్టి రాష్ట్రాన్ని మళ్ళీ పరుగులు పెట్టించాలి. ఇక్కడే అందరికీ ఓ అనుమానం వస్తోంది. చంద్రబాబు చెప్పింది నిజమే అయితే మరి జగన్ కు జనాలు 151 సీట్లు ఎందుకు ఇచ్చినట్లు ?