జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాయ‌ల‌సీమ టూర్ షెడ్యూల్ ఖ‌రారైంది. డిసెంబర్ 1 వ తేదీ నుంచి ఆరు రోజులపాటు రాయలసీమ జిల్లాలలో ఆయ‌న ప‌ర్యటన సాగ‌నున్న‌ట్లు పార్టీ తెలిపింది. చిత్తూరు, కడప జిల్లాల్లో పర్యటించ‌నున్న ప‌వ‌న్ రాయలసీమ జిల్లాల సమస్యలపై రైతాంగం, మేధావులతో పలు చర్చలు చేపడతారని వివ‌రించింది. అపరిష్కృతంగా ఉన్న సమస్యలు, మౌలిక సదుపాయాల కల్పనలో, సంక్షేమ పథకాల లబ్ది చేకూర్చడంలో పాలక పక్షం చూపిస్తున్న నిర్లక్ష్యం మూలంగా ఇబ్బందులు పడుతున్న వారి ప్రతినిధులను పవన్ కళ్యాణ్ ఈ పర్యటనలో కలుసుకొని వారి సమస్యలను స్వయంగా తెలుసుకుంటారని పార్టీ పేర్కొంది.

 

ప‌వ‌న్ టూర్ గురించి జ‌నసేన స‌వివ‌రంగా తెలిపింది. ``ప‌వ‌న్ 1 వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి కడప జిల్లాకు వెళ్తారు. 3 గంటలకు రైల్వే కోడూరు చేరుకొని కడప జిల్లా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై రైతులతో చర్చిస్తారు. కడప జిల్లా పార్టీ నేతలు, శ్రేణులతో సమావేశమవుతారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి తిరుపతికి పయనమవుతారు. 2 వ తేదీ ఉదయం 10 గం. తిరుపతి, చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో పోటీ చేసిన అభ్యర్థులు, జనసేన నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు.`` అని తెలిపారు.

 


3 వ తేదీన కడప, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో పోటీ చేసిన అభ్యర్థులు, జనసేన నాయకులతో సమీక్ష ఉంటుందని జ‌న‌సేన తెలిపింది. ``4 వ తేదీ మదనపల్లె చేరుకుంటారు. అక్కడి జనసేన శ్రేణుల స్వాగతం అనంతరం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. అక్కడే బస చేస్తారు. 5 వ తేదీ అనంతపురం జిల్లా నేతలతో సమీక్ష సమావేశం ఉంటుంది. తదుపరి స్థానిక రైతులు, చేనేత కార్మికులతో చర్చిస్తారు. 6 వ తేదీన పార్టీ కార్యక్రమాలలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. రాయలసీమ జిల్లాల్లో జనసేన నాయకులూ, శ్రేణులపై అక్రమ కేసులు బనాయించడం మూలంగా ఇబ్బందులుపడుతున్నవారికి భరోసా ఇస్తారు.`` అని తెలిపింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: