ఉత్కంఠ పరిణామాలకు తెరపడిన నేపథ్యంలో...శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి సంయుక్త సమావేశం ఏర్పాటు చేసుకుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిగా శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరే పేరు ఖరారైంది. సీఎం అభ్యర్థిగా ఉద్ధవ్ థాకరే పేరును ఎన్సీపీ నేత జయంత్ పాటిల్ ప్రతిపాదించగా..ఎన్సీపీ ప్రతిపాదనలకు కాంగ్రెస్ నేత బాలాసాహెబ్ ధోరట్ మద్దతు తెలిపారు. మహావికాస్ అఘాడీ కూటమి ఏర్పాటుకు 3 పార్టీల సంయుక్త సమావేశంలో ఆమోదం తెలిపారు. సీఎం అభ్యర్థిగా, మహావికాస్ అఘాడీ నేతగా ఉద్ధవ్ థాకరేను ఎన్నుకున్నారు.డిసెంబర్ 1న ఉద్ధవ్ థాకరే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. జయంత్ పాటిల్(ఎన్సీపీ), బాలాసాహెబ్ థోరట్(కాంగ్రెస్) డిప్యూటీ సీఎం పదవులు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
మహా వికాస్ అఘాడీ కూటమి నేతలు గవర్నర్ భగత్సింగ్ కొష్యారీని కలిసి ప్రభుత్వ ఏర్పాటు ప్రతిపాదనలు అందించారు. దీంతో ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయాలని గవర్నర్ బీఎస్ కోశ్యారీ ఆదేశించారు. బుధవారం ఉదయం 8 గంటలకు మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశం కానుంది. ఇదిలాఉండగా, కీలక సమావేశానికి అజిత్ పాటిల్ డుమ్మా కొట్టారు. మూడు పార్టీల సంయుక్త సమావేశానికి అజిత్ పవార్ హాజరు కాలేదు. `అజిత్పవార్ ప్రస్తుతం అందుబాటులో లేరు. ఆయనతో గత రెండు రోజుల నుంచి నేను టచ్లో ఉన్నా. ఇవాళ కూడా ఆయన్ను కలిశా` అని ఎన్సీపీ నేత జయంత్ పాటిల్ తెలిపారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్ రాజీనామా చేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'బీజేపీ పతనం ఇప్పుడే ఆరంభమైంది. బీజేపీకి అహంకారం పెరిగింది. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవి చేపడుతారని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మాకు తెలిపారు. దీనికి ఉద్ధవ్ జీ కూడా అంగీకరించారు. మత రాజకీయాలు చేయడానికి శివసేన ఆవిర్భవించలేదు. మహారాష్ట్ర ప్రజలకు సేవ చేయడానికే ఉనికిలోకి వచ్చింది. బీజేపీతో చేతులు కలిపిన తర్వాతనే శివసేన నాశనమైందని' నవాబ్ పేర్కొన్నారు. ఎన్సీపీ-శివసేన-కాంగ్రెస్ కూటమి పూర్తికాలం అధికారంలో ఉంటుందని అన్నారు.