తెదేపా నేతల ఆరోపణలపై ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.. గత ఎన్నికల్లో ప్రజలు ఛీత్కరించినా చంద్రబాబుకు బుద్ధి రాలేదని. చంద్రబాబుకు మతిభ్రమించిందని.. అందుకే మళ్లీ జమిలి ఎన్నికల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీకి ఈ సారి ఎన్నికలు జరిగితే ఒక్క సీటు కూడా రాదన్న విషయాన్ని చంద్రబాబు గుర్తుపెట్టుకోవాలంటూ వాఖ్యానించారు. ఇకపోతే ఈ మద్య చంద్రబాబు మాతో పెట్టుకుంటే మటాష్ అని చేసిన వ్యాఖ్యలపై శ్రీకాంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.

 

 

గతంలోనూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై కూడా అసెంబ్లీలో ఒకసారి ఇలాంటి వ్యాఖ్యలే చేసిన మరుసటి రోజు నుండే ఆయన కనిపించకుండా పోయారని, ఈ విషయంపై ఇప్పటికీ తమకు అనుమానాలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు... దీనిపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు. ఇకపోతే నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి మాట్లాడవలసిన మాటలేనా ఇవి అని ఆయన తప్పుబట్టారు.

 

 

ఇదే కాకుండా టీడీపీ నేతలు వైఎస్ వివేకా హత్య కేసు ఛేదించలేకపోయారని చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. చాలా పకడ్బందీగా కేసు విచారణ జరుగుతోందని.. త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు. ఇదేకాకుండా వివేకా హత్య.. ఆ తరువాత చంద్రబాబు చేసిన కుట్రలను స్పష్టంగా ప్రజలకు వివరిస్తామని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.

 

 

అంతే కాకుండా ఎన్టీఆర్ చావుకు కారణాలపై కూడా విచారణ జరిపిద్దామంటూ సవాల్ చేశారు. ఇక చంద్రబాబు, పవన్, రాయలసీమను అవమానపరిచేలా మాట్లాడుతున్నారని, వాళ్లిద్దరూ సీమ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక చంద్రబాబు విధి విధానాలు నచ్చకనే రాయలసీమ ప్రజలు తగిన బుద్ది చెప్పారని,దాని ఫలితమే  గత ఎన్నికల్లో చిత్తూరు జిల్లా సహా రాయలసీమలో చావుదెబ్బ తగిలిందని ఘాటుగా వ్యాఖ్యానించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: