నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆసక్తికర పరిణామాలతో వార్తల్లో నిలుస్తున్నారు. తెలుగు భాషపై ఆయన చేసిన వ్యాఖ్యలతో మొదలైన దుమారం...అనంతరం ముదిరి పాకాన పడుతోంది. పార్టీ, ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ఆయన పార్లమెంట్లో మాట్లాడారని చర్చ జరుగుతోంది. ఇది జరిగిన మరుసటి రోజే ప్రధాని మోదీ...రఘురామ కృష్ణంరాజును పలకరించడం, ఆయన ప్రధానికి నమస్కరిండం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. దీనిపై వివరణ ఇచ్చిన రఘురామకృష్ణం రాజు మళ్లీ బీజేపీ ఆఫీసులో తచ్చాడటం సంచలనంగా మారింది.
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు...వైసీపీలో ఉంటారా లేక బీజేపీలో చేరుతారా? అన్న చర్చలతో ఈ మధ్యకాలంలో ఆయన తరచూ వార్తలకెక్కుతున్నారు. ప్రధాని మోదీ పలకరించింది మొదలు రఘురామకృష్ణంరాజు.. బీజేపీ నేతలతో టచ్లో ఉంటున్నారని అంటున్నారు. సోమవారం ఏకంగా బీజేపీ ప్రధాన కార్యాలయంలో రఘురామకృష్ణంరాజు ప్రత్యక్షమయ్యారు. దాంతో ఆయన బీజేపీలో చేరడం ఖాయమని ప్రచారం మొదలైంది. కాగా, వైసీపీ నేతలు తమతో టచ్లో ఉన్నారంటూ ఇటీవలే బీజేపీలో చేరిన ఎంపీ సుజనాచౌదరి ప్రకటనలు చేస్తున్న తరుణంలో రఘురామకృష్ణంరాజు లాంటి ఎంపీలు బిజెపి నేతలతో అంటకాగడం వైసీపీ అధినేత జగన్కు నచ్చడం లేదని తెలుస్తోంది.
అయితే, దీనిపై రఘురామకృష్ణం రాజు ఘాటుగా స్పందిస్తున్నారు. ఓ మీడియా సంస్థతో ఆయన మాట్లాడుతూ...జగన్ తనపై సీరియస్ అయిన విషయం నిజమే అని అన్నారు. పార్లమెంటులో మాట్లాడిన విషయం తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. తెలుగు అనే మాటే నా నోటి నుంచి రాకూడదు అనుకుంటే ఎలా? అని ప్రశ్నించారు. పార్టీలోనే కొన్ని శక్తులు నాకు, జగన్కు కమ్యునికేషన్ గ్యాప్ క్రియేట్ చేస్తున్నాయని అన్నారు. పార్టీలో తనపై కుట్ర జరుగుతుంది అని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, దీనిపై వైసీపీ అభిమానులు సోషల్ మీడియాలో ఘాటు కామెంట్లు చేస్తున్నారు. సొంత ఎంపీపై పార్టీ ఎందుకు కుట్ర చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో తన కుమారుడితో కలిసి టీడీపీలో చేరిన రఘురామ కృష్ణం రాజు... అనంతరం మీడియాతో మాట్లాడుతూ....టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు రాముడైతే... మంత్రి నారా లోకేష్ లక్ష్మణుడంటూ అభివర్ణించడాన్ని గుర్తు చేస్తూ...రామలక్ష్మణులు అన్నదమ్ములైతే...తండ్రి కొడుకులకు ఆ పోలిక పెట్టి కామెడీ చేశారని మరికొందరు అంటున్నారు. ఒంటి మీదున్న షర్ట్ని తీసేసి వేరేది వేసుకున్నంత ఈజీగా పార్టీలు మారిపోయిన ఆయనకు నర్సాపురం ఎంపీగా విజయతీరానికి చేర్చింది వైసీపీ అనే విషయం మర్చిపోయారని అంటున్నారు.