మరాఠాల ప్రతీకగా మారిన శివసేన పార్టీ కేంద్రంగా ఆ రాష్ట్రంలో...ప్రభుత్వ ఏర్పాటుపై సంచలన పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. సీఎం పదవికి దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేసిన కొద్ది గంటలకే మంగళవారం సాయంత్రం ఒక హోటల్లో సమావేశమైన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు ఉద్ధవ్ ఠాక్రేను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే బాధ్యతలు చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. తాజాగా ఇదే సమయంలో...శివసేన అధినేత, మహా వికాస్ అఘాడి సీఎం అభ్యర్థి ఉద్ధవ్ ఠాక్రే సతీసమేతంగా గవర్నర్ భగత్ సింగ్ కోష్యారిని కలిశారు. అయితే, ఇదే ఈ దంపతుల తనయుడు ఆదిత్యా ఠాక్రే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనుండటం చర్చనీయాంశంగా మారింది.
1966 లో శివసేన పార్టీని బాలసాహెబ్ ఠాక్రే ఏర్పాటు చేశారు. 2012లో తండ్రి మరణాంతరం ఉద్ధవ్ శివసేన పగ్గాలు చేపట్టారు. ఠాక్రే కుటుంబం ఇప్పటి వరకు ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంది. ఉద్ధవ్ తండ్రి దివంగత బాల్ ఠాక్రే ఎన్నడూ ప్రభుత్వ పదవిని చేపట్టనప్పటికీ.. 1995-99 మధ్య ఏర్పడిన శివసేన-బీజేపీ ప్రభుత్వాన్ని వెనుక నుంచి నడిపించారు. ఉద్ధవ్ కొడుకు ఆదిత్య ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వర్లీ నుంచి ఘన విజయం సాధించి ఆ సంప్రదాయానికి స్వస్తి పలికారు. ఆయన గెలుపులో ఈ నియోజకవర్గంలోని తెలుగువారిది కీలక పాత్ర. ఇదే సమయంలో బాల్ఠాక్రే కుటుంబం నుంచి ప్రభుత్వ పదవిని చేపట్టనున్న మొట్టమొదటి వ్యక్తి ఉద్ధవ్ ఠాక్రే కానున్నారు.
అయితే, ఇక్కడే కీలక పరిణామం చోటు చేసుకోనుంది. సీఎం పదవిని చేపట్టనున్న ఉద్ధవ్ ఎమ్మెల్యేగా గెలవలేదు. దీంతో ప్రమాణ స్వీకారం తర్వాత ఆరు నెలల్లోపు ఎమ్మెల్యేగా లేదా ఎమ్మెల్సీగా ఎన్నికవ్వాలి. అయితే, ఎమ్మెల్యేగా గెలిచేందుకు ఉద్దవ్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. కనుక పార్టీ తరుఫున గెలిచిన వారిలో ఒకరు రాజీనామా చేయాలి. కాగా, తండ్రి కోసం ఆదిత్య తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వర్లీ నుంచి ఉద్దవ్ బరిలో దిగితే...ఘన విజయం సాధిస్తారని శివసేన వర్గాలు భావిస్తున్నాయి.