``దేశంలో ఎందరినో నేను రాష్ట్రపతలును, ప్రధానమంత్రులను చేశా. అంతెందుకు..నాకు ప్రధానమంత్రి పదవి ఇస్తానంటే...వద్దన్నాను. అసలు ప్రధాని మోదీ కంటే నేనే సీనియర్. నాకంటే రాజకీయాల్లో సీనియర్ ఎవరున్నారు?`` ఈ అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డ్ వంటి సొంత డబ్బా ఎవరిదో తెలుసుకదా? స్వయం ప్రకటిత జాతీయ పార్టీ అధ్యక్షుల వారైన ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. చక్రం తిప్పుతానంటు చెప్పుకొనే ఆయనకు మరోమారు ఊహించలేని పరాభవం ఎదురైందని సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది.
వివరాల్లోకి వెళితే...సస్పెన్స్ థ్రిల్లర్ను మించిన ట్విస్టులతో మహారాష్ట్రలో బీజేపీ సారథ్యంలోని ప్రభుత్వం కుప్పకూలి... మహావికాస్ అఘాడీ పేరుతో శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి సర్కారు ఏర్పాటు కానున్న సంగతి తెలిసిందే. శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రేను సీఎం అభ్యర్థిగా మిత్రపక్షాలు ఎన్నుకున్న సంగతి తెలిసిందే. ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన ఎమ్మెల్యేలంతా కలిసి సీఎం అభ్యర్థి ఉద్ధవ్ థాకరేనే అని తెలుపుతూ.. గవర్నర్కు లేఖ అందజేశారు. శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే, ఆయన భార్య రశ్మి ఇవాళ ఉదయం రాజ్భవన్లో గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉద్ధవ్ థాకరేకు గవర్నర్ కోశ్యారీ శుభాకాంక్షలు తెలిపారు.
నేడు సాయంత్రం 6:40 నిమిషాలకు మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్ థాకరే ప్రమాణస్వీకారం చేయనున్నారు. శివాజీ పార్కులో ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉద్ధవ్ థాక్రే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యనేతలనందరినీ ఆహ్వానిస్తున్నారు. ఆ ముఖ్యనేతలు ఎవరంటే...బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు నుంచి డీఎంకే నేత స్టాలిన్లను ఆహ్వానిస్తున్నారు. ఇందులో జాతీయ నేత చంద్రబాబు గారి పేరు లేదు. ఆయనిప్పుడు ముఖ్యమంత్రి కాదు కదా? ఎలా పిలుస్తారు? అని అనుకోవచ్చు. కానీ...స్టాలిన్ కూడా ముఖ్యమంత్రి కాదు. కనీసం గతంలో చంద్రబాబు వలే ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం కూడా లేదు. కానీ ఆయనకు ఆహ్వానం అందింది! బాబు గారికి అందలేదు!!. కొసమెరుపు ఏంటో తెలుసా?.. కొద్దికాలం క్రితమే బాబు గారు స్వయంగా ముఖ్యమంత్రి పీఠం ఎక్కనున్న ఉద్దవ్ ఠాక్రేను, ఆయన తనయుడు ఆదిత్య ఠాక్రేను కలిసి వచ్చారు. కనీసం ఆ కోణంలో అయినా...ఆయనకు ఆహ్వానం అందలేదంటూ...నెట్టింట జోకులు పేలుతున్నాయి.