ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అమరావతి పర్యటన ఉద్రిక్తతకు, ఉత్కంఠకు దారితీసింది. పార్టీ ప్రజాప్రతినిధులు, ఇతర నేతలతో కలిసి చంద్రబాబు ఈ టూర్ తలపెట్టిన సంగతి తెలిసిందే. సీడ్ యాక్సిస్ రోడ్ ద్వారా వెంకటపాలెం మీదుగా ఉద్దండరాయునిపాలెం చేరుకొని అక్కడ ప్రధాన మంత్రి నరేంద్రమోడి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించి పేదలు, అధికారులు, జడ్జీలు ప్రజాప్రతినిధుల కోసం వేర్వేరుగా నిర్మించిన గృహ సముదాయాలను చంద్రబాబు పరిశీలించే షెడ్యూల్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ టూర్లో పెయిడ్ అర్టిస్టుల బాగోతం తెరమీదకు వచ్చింది.
ముందుగా నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం విట్, ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయాలను సందర్శించిన అనంతరం వెంకటాయపాలెం, ఉద్దండరాయునిపాలెం, నేలపాడు, రాయపూడి, ఐనవోలు గ్రామాల మీదుగా టీడీపీ నేతల బృందం పర్యటన సాగనున్న సంగతి తెలిసిందే. ఈ టూర్ సమయంలోనే...బస్సులో చంద్రబాబు పార్టీ నేతలతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ``వైసీపీ నేతలు ఆందోళనలకు సిద్ధమయ్యారా? ఏర్పాట్లు చేసుకునే ఉంటారు. అయినా వాళ్లకు పెయిడ్ ఆర్టిస్టులు తప్ప మరెవరు వస్తారు?`` అంటూ ఆందోళన చేసిన వారిని పెయిడ్ ఆర్టిస్టులుగా చంద్రబాబు పేర్కొన్నారు.
అయితే, దీనిపై వైసీపీ వర్గాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. పెయిడ్ ఆర్టిస్టుల సంస్కృతి టీడీపీదేనని అంటున్నారు. గుంటూరులో ఏర్పాటు చేసిన వైసీపీ బాధితుల శిబిరంలో స్పష్టమయిందని చెప్తున్నారు. శిబిరంలో ఉన్న కొమ్ము ఏసుబాబు అనే యువకుడు ఇందులో పాల్గొంటే తనకు రూ. 10 వేలు ఇస్తానని చెప్పిన తెలుగుదేశం నేతలుశిబిరం ఖాళీ చేసే సమయంలో తనకు 10 వేల రూపాయలు ఇవ్వమంటే ఇవ్వకుండానే నేతలు వెళ్లిపోయారని....టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, టీడీపీ నేతలపై బహిరంగంగానే మండిపడ్డాడు. మరోవైపు, ఇటీవల కృష్ణా వరదల సమయంలో టీడీపీ సోషల్ మీడియా విభాగం ఓ పోస్టు చేసింది. అందులో వరదల కారణంగా నష్టపోయిన ఓ రైతు ఆవేదన వినిపించారు. వాస్తవానికి ఆయన రైతు కాదు.. టీడీపీ పెయిడ్ ఆర్టిస్టు.. పేరు శేఖర్ చౌదరి. శేఖర్ చౌదరిది గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం అని వైసీపీ నేతలు బట్టబయలు చేశారు. ఇలా పెయిడ్ ఆర్టిస్టులకు కేరాఫ్ అడ్రస్ అయిన బాబు ఇప్పుడు అదే కామెంట్ను వైసీపీపై చేయడం చిత్రంగా మారిందంటున్నారు.