జగన్ అయిదేళ్ళ సీఎం అని జనం అనుకుంటున్నారు, వారు అలాగే బండ మెజారిటీ ఇచ్చి సీట్లో జగన్ని కూర్చోబెట్టారు. కానీ శుభం పలకరా  అంటే ఏదో అన్నట్లుగా జగన్ ప్రమాణం చేసిన దగ్గర నుంచి దిగిపోతారనే టీడీపీ తమ్ముళ్ళు  ప్రచారం చేస్తూ వస్తున్నారు. జగన్ మీద ఏవేవో పుకార్లు పుట్టిస్తున్నారు. ఆఖరుకు జనసేనాని  పవన్ కళ్యాణ్ సైతం జగన్ కి అటూ ఇటూగా ఏమైనా జరిగితే అంటూ సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. అంటే జగన్ అయిదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండరన్నది వీరందరి నమ్మకం. ఉండకూడదని బలమైన కోరిక.

 

దీని మీద విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాలయ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ జగన్ జైలుకి పోతాడంటూ మళ్ళీ హాట్ కామెంట్స్ చేశారు. జగన్ కనుక జైలుకు వెళ్తే ఆ సీటు పట్టేద్దామని బొత్స సత్యనారాయణ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని విమర్శించారు.

 

బొత్స ఎన్ని వినయాలు చూపించినా ఎంత సీనియారిటీ కబుర్లు చెప్పినా అయనకు  వైసీపీలో ముఖ్య‌మంత్రి కుర్చీ ఇవ్వరని అంటున్నారు జగన్  జైలుకు కనుక వెళ్టే ఆ సీట్లో ఆయన భార్యను ముఖ్యమంత్రిని చేస్తారంటూ సంచలన కామెంట్స్ కూడా అయ్యన్నపాత్రుడు చేశారు. అపుడే జగన్ జైలుకు వెళ్ళినట్లు ఆయన వారసురాలి ఎంపిక కూడా పూర్తి అయినట్లుగా అంతా దగ్గరుండి తానే విన్నట్లుగా, చూసినట్లుగా అయ్యన్నపాత్రుడు చెప్పడంపైన వైసీపీ నేతలు మండిపడుతున్నారు.

 

ఆరు నెలల పాలన పూర్తి చేసుకుని అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉంటే అయ్యన్న ఓటమి బాధ తాళలేక ఇలా మాట్లాడుతున్నారని అంటున్నారు. మొత్తానికి జగన్ని జైలుకు పంపించి ఆయన భార్యను సీఎం చేసే దాకా అయ్యన్న తనదైన  కధను అల్లేశారని సెటైర్లు పడుతున్నాయి. వైసీపీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని, సొంత పార్టీ మరో వైపు పాతాళానికి పోతున్నా పట్టడం లేదని అంటున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: