తెలంగాణ కాంగ్రెస్ ను ప్రక్షాళన చేయాలని అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే మొదట పీసీసీ చీఫ్ ని మారుస్తారా ? లేకపోతే ఏఐసీసీ ఇంఛార్జ్ మారతారా అనే చర్చ జరుగుతోంది. ఎవరికి అవకాశం ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. 


తెలంగాణ కాంగ్రెస్ లో పదవుల మార్పుపై జోరుగా చర్చ జరుగుతోంది. అయితే కొన్ని రోజుల నుండి పీసీసీ మార్పుపైనే హాట్ హాట్ గా చర్చ నడిచింది. డిసెంబర్ మొదటి వారంలో మార్పు ఖాయమని, ఏఐసీసీ ఇప్పుడే ఎవరికిస్తే బాగుంటుందనే ఆరాలు తీస్తున్నట్టు సమాచారం. పీసీసీ కోసం పార్టీ లో అర్హత ఉన్న నాయకులందరూ వారి వారి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో పీసీసీ కంటే ముందు ఏఐసీసీ ఇన్ ఛార్జ్ మార్పు ఉంటుందనే చర్చ తెర పైకి వచ్చింది. 


రాష్ట్రం లో పీసీసీ కంటే ముందు ఏఐసీసీ ఇన్ ఛార్జ్  మారిస్తే బాగుంటుందనే వాయిస్ ని కొందరు నేతలు హై కమాండ్ దగ్గర వినిపించినట్టు తెలుస్తోంది. దీంతో పీసీసీ కంటే ముందు ఇన్ ఛార్జ్ మార్పు ఉంటుందనే చర్చ ఇప్పుడు పార్టీ వర్గాల్లో నడుస్తోంది. ఐతే ప్రస్తుతం ఉన్న ఇన్ ఛార్జ్ స్థానంలో ఎవరిని నియమిస్తారనే చర్చ మొదలైంది. కుంతియా ఇంఛార్జిగా ఉన్నప్పటి నుండి... పార్టీ ఆశించిన ఫలితాలు రాబట్టలేదన్న ఫీలింగ్ చాలా మంది నాయకుల్లో ఉంది. ఇప్పటికే ఏఐసీసీ నుండి పీసీసీ వరకు అన్ని స్థాయిల్లో మార్పులు చేయాలని పార్టీ భావిస్తున్న తరుణంలో.. కుంతియాను కూడా మార్చుతారనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ఎవరికి అవకాశం ఇస్తారనే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. తెలంగాణ కు పరిచయం ఉన్న నాయకుడు, కాస్త ప్రభావితం చేయగలిగిన నాయకుడిని ఇంఛార్జిగా పెట్టే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఏఐసీసీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.  ఈ పదవులపై దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా చర్చించుకుంటున్నాయి వార్టీ వర్గాలు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: