హైదరాబాద్ షాద్నగర్ లో వైద్యురాలు దిశా అత్యాచారం హత్య ఘటన దేశ మొత్తం కలకలం రేపిన విషయం తెలిసిందే. దిశా ఘటనలో నిందితులకు కఠిన శిక్షలు పడాలంటు దేశం మొత్తం నిరసన వ్యక్తం చేస్తోంది. దిశా రేప్ కేసులో నలుగురు నిందితులు ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నారు. ప్రధాన నిందితుడైన మహమ్మద్ ఆరిఫ్, జోళ్లు శివ, జోళ్ళు నవీన్ చెన్నకేశవులు దిశ రేప్ కేస్ ఘటనలో నిందితులుగా ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నారు. అయితే వీరిని ఎట్టిపరిస్థితిలో ఉరితీసి చంపాలంటూ దేశం మొత్తం నినదిస్తోంది. మరోసారి ఏ ఆడపిల్లలపై అత్యాచారం చేయటానికి భయపడేలా వారికి శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. మీరు చంపక పోతే మాకు వదిలేయండి మేమే చంపేస్తామంటూ నిరసనలు తెలుపుతున్నారు.
అయితే నిందితుల తల్లిదండ్రులు ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలి పనులు చేసుకుంటూ తమ కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని తమ కొడుకుల కోసం లాయర్ ను పెట్టుకునె ఆర్థిక స్తోమత లేదని అత్యాచార కేసులో నిందితుల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కూలి పనులకు వెళ్తేనే తమకు నాలుగు మెతుకులు నోట్లోకి వెళ్తాయని... కూలీ లేకపోతే పూటగడవదని... అలాంటి స్థితిలో ఉన్న తాము లాయర్ను పెట్టుకోలేము అంటూ ప్రధాన నిందితుడైన మహమ్మద్ ఆరిఫ్ తండ్రి హుస్సేన్ ఆవేదన వ్యక్తం చేశారు. తామిద్దరం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నామని ఇప్పటివరకు కుటుంబాన్ని తమ కొడుకు మహమ్మద్ రఫీ పోషించాడని తెలిపారు.
రెండో నిందితుడైన జోలు శివ తండ్రి రాజప్ప మాట్లాడుతూ... తన కొడుకు తప్పు చేసినట్లు తెలిస్తే ఎటువంటి శిక్ష విధించిన తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. కానీ తమ తరఫున లాయర్ని పెట్టుకునే ఆర్థిక స్తోమత మాత్రం తమకు లేదని తెలిపారు. మూడో నిందితుడైన జోళ్లు నవీన్ తల్లి లక్ష్మీ మాట్లాడుతూ... ప్రధాన నిందితుడైన మహమ్మద్ ఆరిఫ్ వల్లే తన కుమారుడు దారి తప్పాడు అంటూ ఆరోపించింది. 12 ఏళ్ల క్రితమే తన భర్త చనిపోయాడు అని... భర్త చనిపోయినప్పటికీ కూలి పనులు చేసుకుంటూ కుటుంబ పోషణ నెట్టుకొస్తున్నాను అని ఆమె తెలిపింది. ఇప్పటికీ కుమారుని పోషన తానే చూసుకుంటున్నానని తెలిపింది. నాలుగవ నిందితుడైన చెన్నకేశవులు తల్లిదండ్రులు మాట్లాడుతూ... నా కొడుకు చెన్నకేశవులు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడని తెలిపారు . తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తమ కుమారుడు ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డాడు అంటే అసలు నమ్మలేకుండా ఉన్నామంటూ చెన్నకేశవులు తల్లిదండ్రులు కురుమయ్య జయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.