వరుసగా ఆడపిల్లలు, మహిళలపై జరుగుతున్న దారుణాలతో అట్టుడికిపోతున్న రాష్ట్రంలో ఇప్పుడు సరికొత్త విధంగా చర్యలు చేపట్టడానికి పోలీసులు రంగం సిద్దం చేస్తున్నారు. అదేమంటే ఎక్కడైన అనుకోని ఘటన జరిగితే రాష్ట్ర పోలీసు సాయం అవసరమైన వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డయల్ 100కు ఎవరైనా ఫోన్ చేస్తే 7 నిమిషాల్లో చేరుకుంటున్నామంటున్నారు. బాధితులెవరైనా 100కు డయల్ చేస్తే మూడు నిమిషాల్లోనే వారికి తిరిగి కాల్ చేసి రెండే రెండు నిమిషాల్లో పోలీసులు వారి వద్దకు చేరుకుంటామని ఉన్నతాధికారులు చెప్పారు.
ఇకపోతే శంషాబాద్లో దిశ హత్య ఘటన తర్వాత డయల్ 100కు కాల్స్ పెరిగాయి. సాధారణంగా రోజు వచ్చే కాల్స్ కంటే 2 నుంచి మూడువేల కాల్స్ అదనంగా వస్తున్నాయని పోలీసు అధికారులు వెల్లడించారు. ఇక ఇప్పటికే పోలీసులు ఘటనా స్థలానికి వచ్చే సమయంపై విమర్శలు వెల్లువెత్తుతు ఉండటంతో పోలీసు ఉన్నతాధికారులు మంగళవారం స్పందించారు. డయల్ 100కు కాల్ వచ్చిన వెంటనే తాము స్పందిస్తున్నామని, దగ్గరలోని పెట్రోలింగ్ వాహనాన్ని అప్రమత్తం చేస్తున్నామని కాని కాల్ చేసిన వారి వద్దకు చేరుకునే మార్గంలో ట్రాఫిక్ ఉండటం వల్ల ఆలస్యమవుతోందని చెప్పారు.
ఇక జిల్లాలు, గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఈ సమయం 10 నిమిషాలుగా ఉందని వెల్లడించారు. వాస్తవానికి నగరాల్లో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుంటున్న సమయం 7 నుంచి 10 నిమిషాలు ఉంటుండగా.. గ్రామాల్లో ఇది 10 నుంచి 12 నిమిషాలు ఉంటుందని పేర్కొన్నారు. ఇకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడపిల్లలు, మహిళలు ధైర్యం కోల్పోవద్దని, ఆపద ఎదురైనపుడు దైర్యంగా ఎదురించి పోరాడాలని విమెన్సేఫ్టీ వింగ్ చీఫ్, ఐజీ స్వాతి లక్రా విజ్ఞప్తి చేశారు.
ఎవరు వేధించినా, బెదిరించినా..వెంటనే డయల్ 100కు ఫోన్ చేయాలని ఆమె సూచించారు. ఇదే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా పోలీసులతో పాటు, షీటీమ్స్ సిబ్బంది కూడా నిమిషాల్లో మీకు రక్షణ కల్పించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు..