నిన్న మంగళవారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించు కొని వనపర్తి జిల్లా కేంద్రంలోని దాచా లక్ష్మయ్య ఫంక్షన్‌హాల్‌లో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైనారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి.. ఈ సందర్భంగా ఆయన జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

 

 

ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల కు పూర్తి అండగా నిలుస్తుందని, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మిస్తున్న చోట దివ్యాంగులు ఉన్నట్టయతే వారికి అవకాశం కల్పిస్తామని ఆయన తెలిపారు. ఇకపోతే దివ్యాంగులు వికలత్వం కోరుకుంటే వచ్చింది కాదని జన్యుపరంగా, అనారోగ్య రీత్యా కొన్ని ప్రత్యేక కారణాల వల్ల వచ్చిందని అంతమాత్రం చేత వారు సమాజంలో ఎవరి కంటే తక్కువ కాదని గుర్తుచేశారు.

 

 

ఇకపోతే దివ్యాంగుల సంక్షేమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రూ.3016 పింఛన్ ఇస్తున్న దని తెలిపారు. వనపర్తి జిల్లా కేంద్రంలో స్థలం ఇస్తే దివ్యాంగుల భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

 

 

ఈ సందర్భం గా మంత్రి దివ్యాంగులకు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. జిల్లా పరిషత్ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి మాట్లాడుతూ దివ్యాంగుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్లాలని సమస్యల పరిష్కారానికి సావధానంగా కృషి చేయాలని, అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని వారి సామర్థ్యాలను నిరూపించుకోవాలని సూచించారు..

 

 

ఈ సందర్భంగా ఆయన దివ్యాంగుల సదరం శిబిరాల ధ్రువ పత్రాలను, ఆటల పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఉపాధి హామీ పథకం కింద వంద రోజులు పూర్తి చేసుకున్న దివ్యాంగులకు కూడా ధ్రువపత్రాలను అందజేశారు. కొంత మంది దివ్యాంగులను శాలువాలు, జ్ఞాపికలతో సన్మానించారు.  ఈ కార్యక్రమంలో అడిషనల్ ప్రాజెక్టు డైరెక్టర్ రేణుక, సీడీపీఓ కృష్ణచైతన్య తదితరులు పాల్గొన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: