తెలంగాణ కొత్త సీఎస్ గా ఎవరిని నియమిస్తారనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ నెలాఖరుతో ఎస్‌కే జోషీ పదవికాలం ముగిస్తుంది. దీంతో తర్వాత సీఎస్‌గా సీఎం ఛాయిస్‌ ఎవరనేది ఆసక్తి రేపుతోంది.  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టే అర్హత గల ఐ.ఎ.ఎస్ అధికారులు 14 మంది  ఉన్నారు. వీరిలో ఎవరిని సీఎస్‌గా నియమిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.  

 

తెలంగాణకు కొత్త ప్రధాన కార్యదర్శి రాబోతున్నారు. ప్రస్తుత సీఎస్‌ జోషీ పదవికాలం త్వరలో ముగియనుండటంతో... ఆ స్థానంలో ఎవరు వస్తారనేది ఆసక్తికరంగా మారింది. సీనియారిటీ ప్రకారం చూస్తే జోషి తర్వాత అజయ్ మిశ్రా ఉన్నారు. 1984 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన మిశ్రా 1960 జూలై 16న జన్మించడంతో ఆయన పదవీ విరమణ 2020 జూలై వరకు ఉంటుంది. ప్రస్తుతం ఆయన ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అజయ్ మిశ్రా సీఎస్‌గా నియమిస్తే... ఆయన కేవలం ఏడు నెలలే ఆ పదవిలో కొనసాగే అవకాశం ఉంది. 

 

ఇక తెలంగాణ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారులు కూడా రేసులో ఉన్నారు. ఇందులో బీపీ ఆచార్య టాప్‌లో ఉన్నారు. అయితే, జోషి కంటే ఆచార్య సీనియర్‌ అయినప్పటికీ... గతంలో అతన్ని పక్కన పెట్టారు కేసీఆర్‌.  జోషిని సీఎస్‌గా నియమించారు. దీంతో ఈ సారైనా ఆచ్యారకు అవకాశం కల్పిస్తారా? లేక పెక్కన పెడతారా? అనేది ఆసక్తికరంగా మారింది.


పలువురు కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఐఏఎస్‌ అధికారులు కూడా సీఎస్‌ రేసులో ఉన్నారు. బినయ్ కుమార్‌, పుష్పా సుబ్రమణ్యం, హీరాలాల్‌ పేర్లను కూడా సీఎం కేసీఆర్‌ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో కొత్త సీఎస్‌గా ఎవరు బాధ్యతలు చేపడతారనేది  త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 

 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి సీఎస్‌గా రాజీవ్ శర్మ నియమితులయ్యారు. ఆయన తర్వాత ప్రదీప్ చంద్ర సీఎస్‌గా వచ్చారు. ఐతే... కేవలం నెలరోజులు మాత్రమే ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత ఎస్‌పీ సింగ్‌, ఆ తర్వాత ఎస్‌కే జోషీని సీఎస్‌గా నియమించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: