తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోడలు, నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి గత కొద్దికాలంగా... తమ హెరిటేజ్ గ్రూప్ వ్యవహారాలతో పాటుగా రాజకీయ అంశాల్లో కూడా క్రియాశీలంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఏపీ రాజధానిలో టీడీపీ జాతీయ కార్యాలయం ప్రారంభం కావడం... గుంటూరు జిల్లాలోని మంగళగిరి మండలం ఆత్మకూరు పరిధిలో మూడు అంతస్థులతో నిర్మించిన ఈ ఆఫీసులో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దంపతులు కాకుండా... నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు పూజలు చేయడం తెలిసిన సంగతే. కాగా, ఆమె ఓ వివాదాస్పద అంశంపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, దీపావళిన ఓ బాంబ్ పేల్చిన సంగతి తెలిసిందే. 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' ట్రయలర్ విడుదల చేశారు. కొన్ని పాటలు సైతం విడుదల చేశారు. ఈ సినిమాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్, కేఏ పాల్, పవన్ కళ్యాణ్లను పోలిన పాత్రలు ఉన్నాయి. తనకు చిన్నప్పటి నుంచి గిల్లటం అంటే ఇష్టం అంటూ తను ఇలాంటి వివాదాస్పద చిత్రాలను ఎందుకు రూపొందిస్తున్నాడో వర్మ క్లారిటీ ఇచ్చాడు. తాను ఎవరినీ టార్గెట్ చేసి సినిమా చేయనని కేవలం తనకు ఇంట్రస్టింగ్గా అనిపించిన పాయింట్ను మాత్రమే సినిమాగా తెరకెక్కిస్తానని తెలిపాడు. పక్కాగా రాజకీయ అంశాలను ప్రస్తావిస్తూ వర్మ తీసిన ఈ సినిమా అనంతరం అనేక వివాదాల్లో చిక్కుకుంది. త్వరలో విడుదల కానుంది.
"బ్రేకింగ్ న్యూస్... మూడు సార్లు ముఖ్యమంత్రి చేసిన బాబు పార్టీ చరిత్రలోనే ఎవ్వరూ రుచి చూడనంత ఘోర పరాజయాన్ని చవి చూసిన తరువాత... కొన్ని చాలా విపరీత పరిస్థితులు ఏర్పడుతున్నాయి" అన్న వర్మ కామెంట్రీతో ట్రయిలర్ మొదలవుతుంది. "ఆ దేవుడే నన్ను వెన్నుపోటు పొడిచాడు ఉమా..." అన్న బాబు పాత్రధారి డైలాగ్, "చినబాబుని సీఎం చేసే పూచీ నాది" అనే డైలాగులున్నాయి. లోకేశ్, నారా బ్రాహ్మణి తదితరుల పాత్రలూ కనిపిస్తున్నాయి. ఇలా అనేక వివాదాలు అంశాలున్న ఈ సినిమా విడుదలయిన తర్వాత....తెలుగుదేశం పార్టీని అవమాన పర్చేలా, పార్టీ నేతలను కించపర్చేలా ఉన్నట్లయితే....దూకుడుగా వెళ్లాలని నారా బ్రాహ్మణి భావిస్తున్నట్లు సమాచారం. అవసరం అయితే...పరువు నష్టం దావా వేసేందుకు సైతం వెనుకాడవద్దని ఆమె ఆలోచిస్తున్నట్లుగా సన్నిహితులను పేర్కొంటూ ప్రచారం జరుగుతోంది. కాగా, ఈ సినిమా విషయంలో ఇప్పటివరకు బహిరంగంగా స్పందించని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడైన ఎమ్మెల్సీ లోకేష్కు ఈ నిర్ణయం ఊహించనిదని అంటున్నారు.