కర్ణాటక సీఎం, బీజేపీ నేత బీఎస్ యడియూరప్ప ముఖ్యమంత్రి సీటుకు ఢోకా లేదనే అంచనాలు వెలువడుతున్నాయి. యడియూరప్ప సారథ్యంలోని నాలుగు నెలల ప్రభుత్వం భవితవ్యం...ఉప ఎన్నికల ఫలితాల రూపంలో నేడు తేలనున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని 15 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల ఐదో తేదీన ఎన్నికలు జరుగగా, ఫలితాలు నేడు తొమ్మిదో తేదీన వెలువడనున్నాయి. ఇందుకోసం రా ష్ట్రంలోని 11 కేంద్రాల్లో ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభించారు. మధ్యాహ్నానికల్లా ఫలితాలు వెలువడుతాయని ఎన్నికల సంఘం (ఈసీ) అధికారులు పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం పది స్థానాల్లో అధికార బీజేపీ ముందంజలో ఉంది.
ఈ ఏడాది జూలైలో 17 మంది ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్, జేడీఎస్లకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడంతో అప్పటి స్పీకర్ రమేశ్ కుమార్ వారిపై అనర్హత వేటు వేశారు. దీంతో కుమారస్వామి సారథ్యంలోని జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ సర్కార్ పతనమై.. కర్ణాటక బీజేపీ నేత బీఎస్ యడియూరప్ప ప్రభుత్వం కొలువుదీరింది. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికలు జరిగిన 15 స్థానాలకు బీజేపీ తొమ్మిది నుంచి 12 స్థానాల్లో గెలుపొందుతుందని స్థానిక వార్తాచానెళ్లు, వార్తా సంస్థలు వెలువరించిన ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి.యడియూరప్ప ప్రభుత్వానికి స్పష్టమైన మెజారిటీ రావాలంటే ఆరు స్థానాల్లో బీజేపీ తప్పనిసరిగా గెలుపొందాల్సి ఉంది. అయితే, ఫలితాల సరళి బీజేపీ వైపే ఉంది.
అయితే, ఇప్పటివరకు ఉన్న ట్రెండ్స్ ప్రకారం, అధికార బీజేపీ పది స్థానాల్లో ముందంజలో ఉండగా ప్రతిపక్ష కాంగ్రెస్ 2 స్థానాలు, జేడీఎస్ ఒక స్థానంలో ముందంజలో ఉంది. ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ హవా సాగుతుండటం ఇటు కర్ణాటకలోనే కాకుండా అటు దేశవ్యాప్తంగా కూడా బీజేపీ నేతలను సంతోషంలో ముంచుతోంది. ఉత్కంఠ భరిత స్థితిలో ముఖ్యమంత్రి పీఠం చేజిక్కించుకున్న బీఎస్ యడియురప్ప సీటుకు వచ్చిన ఢోకా ఏం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
.