ఇది సాధారణ కూర్చీ కాదు, ఇందులో కూర్చుంటే ఎవరైనా చనిపోవాల్సిందే. దీన్ని వేళాకోళం చేసిన వ్యక్తులు కూడా ఘోరంగా చనిపోయారు. అందుకే దీన్నిఅందరు ‘డెత్ ఛైర్’ అంటారు. ఓ వ్యక్తి ఎంతో ఇష్టంగా చూసుకున్న ఈ కూర్చి.. అతడి మరణం తర్వాత ఇతరుల ప్రాణాలు తీయడం మొదలుపెట్టింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. కొన్ని దశబ్దాలుగా 200 మంది ఈ కూర్చీ వల్లే చనిపోయారంటే నమ్మబుద్ధి కాదు. చివరికి దాన్ని ఓ మ్యూజియానికి అప్పగించారు. అందులో ఎవరైనా కూర్చుంటారనే భయంతో దాన్ని గోడకు వేలాడి దీశారు,దాన్ని ముట్టుకుని ప్రమాదం కొనితెచ్చుకోవద్దంటూ దాని చరిత్రను సైతం అక్కడ రాసి ఉంచారు. ఆ కుర్చీ గురుంచి తెలుసుకోవాలంటే.. కొన్నేళ్లు వెనక్కి వెళ్లాలి.
అది 1600 సంవత్సరం.. ఇంగ్లాండ్లోని నార్త్ యార్క్షైర్లోని త్రిస్క్ అనే ప్రాంతంలో థామస్ బస్బే , ఎలిజబెత్ ఔటీ అనే దంపతులు ఉండేవారు. కొన్నాళ్లకు వీరి మధ్య మనస్పర్థలు రావటంతో ఎలిజబెత్ తండ్రి డానియల్ ఆమెను తన ఇంటికి తీసుకెళ్లేందుకు కూతురి దగ్గరకు వచ్చాడు. ఐతే వారి ఇంట్లో బస్బేకి ఇష్టమైన కూర్చీలో కూర్చున్న డానియల్ను చూసి ఆగ్రహంతో సుత్తితో తలను పగలగొట్టి చంపేశాడు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. భార్య ఎలిజబెత్ ఇంట్లోని ఫర్నీచర్ను ఓ హోటల్కు ఇచ్చేసింది. అందులో బస్బే ఇష్టపడే కూర్చీ కూడా ఉంది. డానియల్ను హత్య చేసింది బస్బే అని నిరూపణ కావడంతో కోర్టు అతడికి ఉరి శిక్ష విధించింది. ఉరి శిక్ష అమలు సమయంలో బస్బే చివరిగా ఓ కోరిక తీర్చాలని కోరాడు. మరణానికి ముందు తనకు ఎంతో ఇష్టమైన కూర్చీలో కూర్చుంటానని చెప్పాడు. దీంతో అతన్ని ఉరి తీయడానికి ముందు ఆ హోటల్కు తీసుకెళ్లారు. బస్బే తన కూర్చీలో కాసేపు కూర్చొని.. భావోద్వేగానికి గురయ్యాడు. అనంతరం అతడిని ఆ హోటల్కు సమీపంలో ఉన్నకారాగారంలో ఉరి తీశారు.
ఈ ఘటనతో బస్బే పేరు మారుమ్రోగింది. అంతా ఆ హోటల్ను బస్బే హోటల్ అని పిలవడం మొదలుపెట్టారు. దీంతో ఆ హోటల్ యాజమాన్యం కూడా హోటల్ పేరును ‘ద బాస్బే స్టూప్ ఇన్’ గా మార్చింది. అతడు ఉరి వేసుకోడానికి ముందు కూర్చున్న కూర్చీ తమ హోటల్లోనే ఉందంటూ ప్రచారం చేసింది. ఊహించినట్లే అంతా ఆ హోటల్కు వచ్చి ఆ కూర్చీని చూడటం మొదలుపెట్టారు. అందులో కూర్చొని తాము బస్బే కూర్చీలో కూర్చున్నామని గొప్పగా చెప్పుకొనేవారు. కానీ, వారిలో ఆ సంతోషం ఎన్నాళ్లో నిలవలేదు. ఆ కూర్చీలో కూర్చున్న వ్యక్తులు వేర్వేరు కారణాలతో చనిపోయేవారు. ఆ తర్వాత హోటల్లో అదనంగా పబ్ కూడా ఏర్పాటు చేసి, ఆ కూర్చీని పబ్లోకి మార్చారు . ఈ సందర్భంగా ఓ వ్యక్తి ఆ కూర్చీలో కూర్చొని మందు తాగాడు. ఉదయం చూసేసరికి అతడు ఓ స్తంభానికి వేలాడుతూ కనిపించాడు. తొలుత అతడు ఆత్మహత్య చేసుకున్నాడని భావించారు. కానీ, కొందరు మాత్రం.. ఇది తప్పకుండా ఆ కూర్చీ పనే కావచ్చని అనుమానించారు. ఈ ప్రచారం మరో విధంగా హోటల్కు లాభం చేకూర్చింది. ఆ కూర్చితో కొందరూ ‘డేర్’ గేమ్ ఆడటం మొదలుపెట్టారు. ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఏర్పాటుచేసిన విందులో ఇద్దరు సైనికులు ఆ కూర్చీలో కూర్చోడానికి పోటీపడ్డారు. చివరికి వారిద్దరి కారు ప్రమాదంలో దుర్మరణం చెందారు.
అక్కడితో ఆ మరణాలు ఆగలేదు. స్థానికులు కూడా ఆ కూర్చి వల్లే మరణాలు సంభవిస్తున్నాయనే అపవాదును ఆ హోటల్పై వేయడం మొదలుపెట్టారు. దీంతో హోటల్ భవన యజమాని టోనీ ఎర్న్షా ఇకపై అందులో ఎవరూ ఉపయోగించకూడదు అని దాన్ని స్థానిక త్రిస్క్ మ్యూజియానికి అప్పగించాడు. ఆ కూర్చిని నేలపై ఉంచితే ఎవరైనా కూర్చొనే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో దాన్ని గోడకు వేలాడ దీశారు. అది ఎంత ప్రమాదకరమో తెలుపుతూ ఓ కథనాన్ని ఉంచారు. కనీసం ఆ కూర్చిని ముట్టుకొనేందుకు కూడా ప్రయత్నించవద్దని అందులో రాశారు. ఆ కూర్చీలో కూర్చున్నవారు ఎందుకు చనిపోతున్నారో తెలుసుకొనేందుకు ఫర్నీచర్ హిస్టోరియన్ డాక్టర్ ఆడమ్ బావెట్ రంగంలోకి దిగారు. మ్యూజియంలో ఉన్న ఆ కూర్చీ బెస్బే ఉరి సమయంలో కూర్చున్నది కాదని తెలిపారు. అది సుమారు 138 ఏళ్ల కిందటిదని, సుమారు 1840లో దాన్ని తయారు చేసి ఉండవచ్చని పేర్కొన్నారు. మరి, అది నిజమైన బెస్బే కూర్చీ కాకపోయి ఉంటే.. ఎవరిది? బెస్బే కూర్చున్న కూర్చీ ఎక్కడ ఉంది? హోటల్ నిర్వాహకులు అసలు కూర్చీని మరెక్కడైనా దాచిపెట్టారా? వంటి అనుమానాలెన్నో వ్యక్తమవుతున్నాయి.