దేశంలో సంచలనం సృష్టించిన హైదరాబాద్‌ దిశ హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ ఘటనపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో దర్యాప్తు జరిపే అంశాన్ని పరిశీలిస్తున్నామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే స్పష్టం చేశారు. తర్వాతి విచారణను రేపటికి వాయిదా వేశారు.

 

దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపిస్తామని సుప్రీంకోర్టు చెప్పింది. ఢిల్లీలోనే ఉండి ఆయన ఈ కేసును దర్యాప్తు చేసేలా చూస్తామని తెలిపారు. ఈ మేరకు మాజీ జస్టిస్‌ పి.వి.రెడ్డిని సంప్రదించామని.. కానీ అందుకు ఆయన నిరాకరించారని చెప్పారు. దర్యాప్తుపై సలహాలు, సూచనలతో రావాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించారు. తెలంగాణ హైకోర్టులో కేసు కొనసాగుతున్న విషయాన్ని విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌ బోబ్డే ప్రస్తావించారు. అనంతరం తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేశారు. తెలంగాణ ప్రభుత్వం తరపున న్యాయవాది ముకుల్‌ రోహత్గి వాదిస్తూ.. తమ వాదనలు విన్న తర్వాత ముందుకు వెళ్లాలని ధర్మాసనాన్ని కోరారు. 

 


ఎన్ కౌంటర్ పై సిట్‌తో దర్యాప్తు చేయించాలంటూ సుప్రీంకోర్టులో పిల్‌ దాఖలైంది. తెలిసిందే. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై స్వతంత్ర దర్యాప్తు జరిగేలా చూడాలని కోరుతూ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సత్వర విచారణకు తీసుకోవాలన్న వినతిని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం పరిశీలించింది. మరో న్యాయవాది ఎం.ఎల్‌.శర్మ కూడా ఇదే తరహా పిల్‌ దాఖలు చేశారు. సిట్ దర్యాప్తును సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు పర్యవేక్షించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ ఈ కేసులో నిందితులను ఉద్దేశపూర్వకంగానే ఎన్‌కౌంటర్‌ చేశారని పిటిషనర్లు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ బోబ్డే స్పందిస్తూ.. హైదరాబాద్ ఎన్‌కౌంటర్‌పై పూర్తి అవగాహనతో ఉన్నామని చెప్పారు. ఈ ఘటనపై జరుగుతున్న అంశాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని వ్యాఖ్యానించారు.

 

ఎన్‌కౌంటర్‌ ఘటనపై సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో దర్యాప్తు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపారు. విశ్రాంత న్యాయమూర్తితో దర్యాప్తు జరిపే అంశంపై మీరేమనుకుంటున్నారో సలహాలు, సూచనలతో రావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాదికి జస్టిస్‌ బోబ్డే ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: