నిర్భయ దోషులకు త్వరలోనే ఉరి శిక్ష పడనుందా? తాజా పరిణామాలు చూస్తే నిజమే అనిపిస్తోంది. ఘటన జరిగిన ఏడేళ్ల తర్వాత దోషులకు ఉరిశిక్ష అమలు కాబోతోంది. క్షమాభిక్షకు రాష్ట్రపతి నిరాకరించడంతో నలుగురికీ మరణదండన ఖాయమైంది. మరోవైపు నలుగురు దోషుల్లో ఒకరైన అక్షయ్ సింగ్ వేసిన రివ్యూ పిటిషన్‌.. ఈ నెల 17న సుప్రీం ముందుకు రానుంది. 

 

ఢిల్లీలో నిర్భయపై మూకుమ్మడి అత్యాచారం, హత్య కేసులో దోషులకి ఉరి శిక్ష అమలు చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. బీహార్‌ బక్సర్‌ జైలు నుంచి ఉరితాళ్లను తీసుకువచ్చారు. ఉరికంబంపై శిక్ష అమలు ఎలా జరపాలో నలుగురు దోషుల బరువు, ఎత్తున్న దిష్టిబొమ్మలకి ఉరి తీసి డమ్మీ ట్రయల్స్‌ వేసి చూశారని జైలు వర్గాలు తెలిపాయి.

 

నిర్భయపై 2012 డిసెంబర్‌ 16 అర్ధరాత్రి బస్సులో ఆరుగురు రాక్షసులు మూకుమ్మడిగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెను దారుణంగా  హింసించడంతో ఆమె కొన్నాళ్లు మృత్యువుతో పోరాడి సింగపూర్‌ ఆస్పత్రిలో కన్నుమూసింది. ఆరుగురు దోషుల్లో ఒకరు జైల్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మరొకరు మైనర్‌ కావడంతో మూడేళ్ల పాటు జువైనల్‌ హోమ్ కు పంపారు. అయితే ఈ కేసులో దోషి అక్షయ్‌సింగ్ వేసిన రివ్యూ పిటిషన్‌పై ఈనెల 17న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ముగ్గురు సభ్యుల ధర్మాసనం దీనిపై విచారణ జరపుతుంది. ఆ తర్వాతే నలుగురు దోషులకు ఎప్పుడు ఉరి శిక్ష అమలు చేసే విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 

 

నిర్భయను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి, ఆమె హత్యకు కారణమైన నేరస్థుల క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రిజెక్ట్ చేశారు. దీంతో  నలుగురు నిందితులకు కోర్టు విధించిన ఉరి శిక్ష అమలు కానుంది. దోషులందరినీ ప్రస్తుతం తీహార్‌ జైలు నంబర్‌ మూడులో వేర్వేరు గదుల్లో ఉంచారు. సీసీటీవీ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. జైలు నంబర్‌ 3లోనే దోషులకి ఉరిశిక్ష అమలు చేయనున్నారు. ఇటీవల మండోలి జైలులో ఉన్న పవన్‌ కుమార్‌ గుప్తాను తీహార్‌ జైలుకి తరలించినట్టు జైళ్ల శాఖ డైరెక్టర్‌  జనరల్‌ సందీప్‌ గోయెల్‌ వెల్లడించారు. ముఖేష్‌ సింగ్, అక్షయ్‌ సింగ్, వినయ్‌ శర్మను ఉంచిన జైలు నెంబర్‌3లో పవన్‌ కుమార్‌ గుప్తాను ఉంచారు.

 

ఇప్పుడు దోషులందరూ ఒకే జైలుకి చేరడంతో వారికి ఉరిశిక్ష అమలు జరపడం ఖాయమన్న వార్తలకు ఊతమిచ్చినట్టయింది. ఐతే...సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ విచారణకు రానున్న నేపథ్యంలో ఉరి ఎప్పుడు అమలు చేస్తారనేది మాత్రం త్వరలోనే తేలిపోనుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: