ఏపీ అసెంబ్లీ ఐదో రోజు వాడీ-వేడిగా మొదలయ్యింది. గురువారం టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మార్షల్స్‌ తో వాగ్వాదంపై సభలో ప్రస్తావనకు వచ్చింది. అధికార-ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. మార్షల్స్‌తో టీడీపీ సభ్యుల వాగ్వాదానికి సంబంధించిన వీడియోను అసెంబ్లీలో ప్రదర్శించారు. గురువారం అసెంబ్లీ గేటు దగ్గర ఏం జరిగిందో చూయించే ప్రయత్నం చేశారు. వీడియోను ప్రదర్శించిన తర్వాత ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. చంద్రబాబు అసెంబ్లీ మార్షల్స్‌ పట్ల అమానుషంగా ప్రవర్తించారని.. ఆయన రావాల్సింది ఆ గేటు నుంచి కాదని.. కానప్పుడు ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. మార్షల్స్ వారి విధుల్ని నిర్వర్తించారని.. మార్షల్స్‌పై ఇష్టారీతిన దుర్భాషలాడారు, దాడికి పాల్పడ్డారన్నారు. ప్రభుత్వ ఉద్యోగిని బాస్టర్డ్ అని చంద్రబాబు తిట్టారని.. లోకేష్ అనే వ్యక్తి అధికారుల గొంతు పట్టుకుని దౌర్జన్యానికి దిగారని ఆరోపించారు. 

 

మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్ మార్షల్స్‌తో దురుసుగా ప్రవర్తించారని.. యూస్‌ లెస్ ఫెలో అని తీవ్ర వ్యాఖ్యలు చేశారని మంత్రి కన్నబాబు సభలో ప్రస్తావించారు. ఉద్యోగుల పట్ల ప్రతిపక్ష నేత చంద్రబాబుకు చులకనని.. తన కుమారుడు లోకేష్‌కు నేర్పించింది ఇదేనా అన్నారు. మార్షల్స్‌ను బాస్టర్డ్ అని తిట్టిన చంద్రబాబు క్షమాపణ చెప్పాలని.. సభ హుందా తనాన్ని కాపాడుకోవాలన్నారు.

 

ఏపీ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదని శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులపై టీడీపీ సభ్యులు ప్రతాపం చూపారని.. ఉద్యోగుల్ని ఇష్టం వచ్చినట్లు తిట్టి దాడి చేశారని మండిపడ్డారు. కొంతమంది ఉద్యోగులకు గాయాలు కూడా అయ్యాయని.. ఆ ఘటనపై టీడీపీ సభ్యులకు పశ్చాత్తాపం కూడా లేదన్నారు. మళ్లీ వాళ్లే ఎదురుదాడి చేస్తున్నారని.. టీడీపీ సభ్యులపై కఠినచర్యలు తీసుకోవాలి అన్నారు. 


 
టీడీపీ సభ్యులు లోపలికి రాకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. అసెంబ్లీ గేటు దగ్గర ఉన్న వాళ్లంతా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలేనని.. అలాంటప్పుడు ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చిందో చెప్పాలన్నారు. గత ఐదేళ్లు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు పోడియం దగ్గరే ఉన్నారని.. సభలో లేని వాళ్ల గురించి ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారని ప్రశ్నించారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: