ఉన్నావ్ ఘటనలో న్యాయం జరుగక ముందే ఉత్తరప్రదేశ్ లో మరో దారుణం జరిగింది. బంధువే కదా అని లోపలికి రానిస్తే.. ఏకంగా మహిళపై అత్యాచారం చేసి, తగలబెట్టేశాడు. 90 శాతం కాలిన గాయాలతో బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఉన్నావ్‌ ఘటనతో ఆందోళనలు, నిరసనలతో అట్టుడుకుతున్న యూపీలో ఒళ్లుగగుర్పొడిచే మరో ఘోరం జరిగింది. 18ఏళ్ల యువతిపై దుండగుడు అత్యాచారం చేసి నిప్పుపెట్టాడు. 90శాతం గాయాలతో ఆమె చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. 22 ఏళ్ల యువకుడైన నిందితుడు ఆమెకు దూరపు బంధువని తేలింది. ఫతేపూర్‌ జిల్లాలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 

 

గతంలో యువతితో కలిసి నిందితుడు సన్నిహితంగా ఉండటంతో బంధువులు పట్టుకొని పంచాయితీ పెట్టారు. ఇద్దరికీ పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో శనివారం ఇంట్లో యువతి ఒంటరిగా ఉండటాన్ని గమనించిన యువకుడు లోపలికి ప్రవేశించి ఆమెపై ఘోరానికి పాల్పడి పెట్రోలు పోసి నిప్పంటించాడు. బాధితురాలిని కాన్పూర్‌ ఆస్పత్రిలో చేర్పించారు.

 

ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్న వరుస ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఓవైపు అత్యాచారాలకు వ్యతిరేకంగా కఠిన చట్టాలు, చర్యలు తీసుకునే ప్రయత్నం జరుగుతున్నా.. అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. ఉన్నావ్ లో ఓ మహిళపై ఇప్పటికే ఘోరం జరిగిపోగా.. అలాంటిదే మరో ఘటన జరుగడంతో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నిందితులను వెంటనే ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతున్నాయి. నిందితులను పోలీస్ స్టేషన్ లో పెట్టి మేపుతారా.. లేక శిక్షిస్తారా అని ప్రశ్నిస్తున్నాయి. పోలీసులు న్యాయం చేయలేకపోతే నిందితులను తమకు అప్పగిస్తే చేసేది చేస్తామని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 

 

ఇటు పార్లమెంట్ లో సైతం వరుస అఘాయిత్యాలపై ప్రతిపక్షనేతలు .. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. నేరాలు అడ్డుకట్ట వేసేందుకు కఠిన చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే మృగాళ్లు అమాయ మహిళలను బలితీసుకునే తంతు ఆగదని హెచ్చరిస్తున్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: