తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.... ఆర్టీసీ కార్మికులను ఆర్టీసీ ఉద్యోగులుగా గుర్తిస్తూ ఉత్తర్వులు వచ్చేశాయి. ఈ మేరకు తెలంగాణ ఆర్టీసీ సర్క్యులర్ జారీ చేసింది. తాజా ఉత్తర్వులతో ఇకపై ఆర్టీసీ కార్మికులను..... ఆర్టీసీ ఉద్యోగులు అని పిలవాల్సి ఉంటుంది. అంతేకాదు అధికారిక కమ్యూనికేషన్‌లో పేర్కొనాలని సర్క్యులర్‌లో క్లారిటీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ నిర్ణయంపై ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని.. సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. 

 

ఆర్టీసీ కార్మికుల్ని ఉద్యోగులుగా పిలుస్తామని.. ఈ మేరకు మార్పులు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. అంతేకాదు ఇక ప్రతీ ఏటా బడ్జెట్‌లో ఆర్టీసీకి రూ. వెయ్యి కోట్లు కేటాయిస్తామని చెప్పారు సీఎం. నాలుగు నెలల్లోనే ఆర్టీసీ లాభాల బాటలో నడవాలని.. ప్రతీ ఏటా సంస్థకు రూ.వెయ్యి కోట్లు లాభం రావాలని ఆకాంక్సించారు. ఉద్యోగులు ఏటా బోనస్ అందుకునేలా లాభాలు రావాలని ఆకాంక్షించారు. 

 

డిసెంబర్ 1న ఆర్టీసీ ఉద్యోగులు కేసీఆర్‌తో ప్రగతి భవన్‌లో సమావేశమయ్యారు. ఆర్టీసీ అభివృద్ధితో పాటూ పలు కీలక అంశాలపై వారితో చర్చించారు.. ఉద్యోగులతో తెలంగాణ సీఎం నేరుగా ముఖాముఖి నిర్వహించారు. అంతేకాదు ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగులపై వరాల జల్లు కురిపించారు. అందరూ ఒకటే కుటుంబంలా ఉండాలన్నారు సీఎం. ఆర్టీసీ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 60 ఏళ్లకు పెంచారు. సమ్మె కాలానికి సంబంధించిన వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు. ప్రైవేట్ సర్వీసులకు అనుమతి ఇచ్చేది లేదన్నారు. 

 

ఇటు ఏపీలో కూడా ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో కలిపేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీన బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. జనవరి 1 నుంచి ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా చలామణి అవుతారని జగన్ అసెంబ్లీలో ప్రకటించారు. ఆర్టీసీ ఉద్యోగుల వేతనాల కోసం రూ.3600 కోట్లను జగన్ సర్కారు భరించనుందని తెలిపింది. ప్రతి ఉద్యోగి సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నానని జగన్ తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: